Hathya Review : వివేకా మర్దర్ ఇతివృత్తంతో రూపొందిన హత్య సినిమా ఎలా ఉందంటే..
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:39 PM
హత్య సినిమా ఎలా ఉందంటే

సినిమా రివ్యూ: హత్య (Hathya Movie Review)
విడుదల తేది: 24–01–2025
నటీనటులు: ధన్యా బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ, భరత్రెడ్డి, బింధు చంద్రమౌళి, శివాజీరాజా శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
కెమెరా: అభిరాజ్ నాయర్,
సంగీతం: నరేష్ సుకుమారన్
నిర్మాత: ప్రశాంత్రెడ్డి
దర్శకత్వంః శ్రీవిద్యా బసవా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR)సోదరుడు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దోషులు ఎవరు? అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. వివేకా కుమార్తె సునీత వైఎస్ అవినాష్ రెడ్డి దీనికి కారణం అని అనుమానం వ్యక్తం చేశారు. వివేక వివాహేతర సంబంధం మరో కారణమని వార్తలొచ్చాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేసిన రాజకీయ నేతలూ ఉన్నారు. వైఎస్ వివేకానంద మర్డర్ మిస్టరీ కొన్ని సినిమాలలో ప్రస్తావనకు వచ్చింది. అయితే... వివేకా హత్యపై దర్శకురాలు శ్రీవిద్య బసవ తెరకెక్కించిన హత్య సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే!
కథ: (Hatya Review)
ఇల్లందు ప్రాంతంలో ప్రముఖ రాజకీయ నాయకుడు జేసి ధర్మేంద్ర రెడ్డి(రవి వర్మ) హత్యకు గురవుతారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారని మొదట వార్తలొస్తాయి. తర్వాత గొడ్డలి వేటు ఆయన ప్రాణాలు పోవడానికి కారణమని తెలుస్తోంది. ధర్మేంద్ర అన్న కుమారుడు కిరణ్ రెడ్డి (భరత్ రెడ్డ్డి) ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకా హత్య కేసును పరిష్కరించడం కోసం సిట్ టీమ్ను ఏర్పాటు చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ సుధ (ధన్యా బాలకృష్ణ) చేతికి కేసును అప్పగిస్తారు. విచారణ చేపట్టిన క్రమంలో సుధ ఏం తెలుసుకున్నారు. ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు), ధర్మేంద్ర రెండో భార్య సలీమా (పూజా రామచంద్రన్), జెసి కుటుంబం.. హత్యకు ఎవరు కారణం? సుధ విచారణలో చివరకు ఏం తెలిసింది?అనేది కథ.
విశ్లేషణ: (Hatya Review)
ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ వైఎస్ కుటుంబం గురించి ప్రత్యేకించి గుర్తు చేయక్కర్లేదు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి తతంగం అందరికీ తెలిసిందే. కథ, క్యారెక్టర్లు కల్పితం అని దర్శకురాలు శ్రీవిద్య బసవ సినిమా రప్రారంభ సమయంలోనే చెప్పారు. వివేకా మర్డర్ మిస్టరీ మీద తీసిన సినిమా ‘హత్య’ అని ట్రైలర్ బయటకు రాగానే అర్థమైపోయింది. వివేక పేరును ధర్మేంద్రగా, పులివెందులను ఇల్లందుగా, జగన్మోహన్ రెడ్డిని కిరణ్ రెడ్డ్డిగా, అవినాష్ రెడ్డిని వెంకటేష్ రెడ్డిగా కడపను కురుప్పుగా ఈ చిత్రంలో చూపించారు. అయితే... ఎవరి క్యారెక్టర్ ఏమిటి? వారి అసలు పేర్లు ఏమిటి? అనేది తెలుసుకోవడం ప్రేక్షకులకు కష్టం ఏమీ కాదు. కథ, క్యారెక్టర్లు, సీన్స్ ప్రేక్షకులకు తెలిసినవే అయినప్పుడు కథనం ఆకట్టుకునేలా గ్రిప్పింగ్గా, ఎంగేజ్ చేేసలా ఉండాలి. తమకు తెలియని కొత్త విషయం ఏదో స్ర్కీన్ మీద చెబుతున్నట్లు అర్థం అవుతూ ఉండాలి. ఆ విషయంలో దర్శకురాలు శ్రీవిద్య బసవ కొంత సక్సెస్ అయ్యారు. విరామ సమయం వరకూ ప్రజలకు తెలిసిన కథే స్ర్కీన్ మీద వస్తుంది. దాంతో ఎగ్జైట్ చేేస సీన్లు గానీ, స్ర్కీన్ ప్లే గానీ కనిపించదు. తదుపరి క్లైమాక్స్ ముందు తాను నమ్మి రాసుకున్న కథను చెప్పడంతో డైరెక్టర్ సఫలం అయ్యారు.
నటీనటుల పనితీరు.. (Hatya Review) ఐపీఎస్ అధికారిగా ధన్య బాలకృష్ణ, ధర్మేంద్రగా రవి వర్మ, సలీమాగా పూజా రామచంద్రన్ చక్కగా నటించారు. నటీనటులు ఒరిజినల్ క్యారెక్టర్లను ఇమిటేట్ చేయడానికి ట్రై చేయకుండా ఆయా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాత్రలో డా.భరత్ రెడ్డి కూడా మేనరిజమ్ చూపించారు. అంతే కానీ... ఇమిటేట్ చేయలేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. మర్డర్ మిస్టరీ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు ఫర్వాలేదు. టెక్నికల్ పరంగా శ్రీవిద్య బసవ మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. నిర్మాత ఖర్చు విషయంలో రాజీ పడలేదు. రాజకీయ నేపథ్యంలో సినిమా తీయడం సవాల్తో కూడిన విషయం. సినివుమా స్టార్స్నే కాకుండా రాజకీయ నాయకులను అభిమానించే వాళ్ల ఉంటారు. అలాంటి వారందరని కన్విన్స్ చేసేలా సినిమా తీయాలి. వారి నమ్మకానికి తగ్గట్టు కథ, సన్నివేశాలు ఉంటే హర్షిస్తారు. లేదంటే విమర్శల పర్వం మొదలవుతుంది. ఎప్పుడైనా గానీ రాజకీయ నేపథ్యంలో సినిమాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరి వైపు ముగ్గు చూపకుండా సినిమా తీయడం కష్టం. ప్రస్తుత అధికార ప్రభుత్వం రూలింగ్లో లేనప్పుడు వారిని కించపరచడానికి వ్యతిరేకులు చాలా సినిమాలు తీశారు. కొన్ని సినిమాలు గత ప్రభుత్వాలు సపోర్ట్గా నిలిచాయి. ఇంకొన్ని సినిమాలు తప్పుబట్టాయి. అయితే.. అటు సపోర్ట్ చేయకుండా, ఇటు అటాక్ చేయకుండా.. వాళ్ల ఇమేజ్ను డ్యామేజ్ చేయకుండా, ఇన్డైరెక్ట్ సపోర్ట్ చేస్తూ రూపొందిన సినిమా ఇది. ఎంత వద్దనుకున్నా.. ఈ చిత్రంలో రాజకీయ కోణం అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు ఎదుటి వర్గానికి సినిమా నచ్చదు. ఈ సినిమాలో హత్య విషయానికి వస్తే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సైడ్ తీసుకుని సినిమా చేసినట్లు క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల, జగన్ సానుభూతిపరులకు సినిమా నచ్చుతుంది. వ్యతిరేకులు డెఫినెట్గా సినిమాను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. సమకాలీన రాజకీయ విషయాలపై అవగాహన ఉన్నవాళ్ళకి ఈ సినిమా కథనంలో దొర్లిన తప్పులు తెలుస్తాయి. రాజకీయ కోణంలో కాకుండా పొలిటికల్ డాక్యుమెంటరీగా చూస్తే ఆకట్టుకునే చిత్రమిది.
ట్యాగ్లైన్: హత్య మరకను మాపే ప్రయత్నం..