Tollywood : హీరోయిన్లు దొరికినట్టేనా?

ABN , First Publish Date - 2023-04-12T00:31:13+05:30 IST

తెలుగులో కథానాయికల కొరత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ సినిమా మొదలైనా, ముందు హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసుకోవడమే అసలు సిసలైన తలనొప్పి. ఎందుకంటే కథానాయికలంతా బిజీనే. వాళ్ల కాల్షీట్లు దొరకడం మామూలు విషయం కాదు...

Tollywood : హీరోయిన్లు దొరికినట్టేనా?

తెలుగులో కథానాయికల కొరత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ సినిమా మొదలైనా, ముందు హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసుకోవడమే అసలు సిసలైన తలనొప్పి. ఎందుకంటే కథానాయికలంతా బిజీనే. వాళ్ల కాల్షీట్లు దొరకడం మామూలు విషయం కాదు. అందుకే ముందు హీరోయిన్‌ని పట్టుకోవడంపైనే దర్శక నిర్మాతలు దృష్టి పెడుతుంటారు. టాలీవుడ్‌లో ఇప్పుడు పలువురు అగ్ర హీరోల సినిమాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాళ్లకు తగిన నాయికల్ని ఎంచుకొనే ప్రక్రియ కూడా సమాంతరంగానే సాగుతోంది.

పవన్‌ కల్యాణ్‌ - సుజిత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘శ్రీకారం’ చిత్రాలతో మెప్పించింది ప్రియాంక. ఆ తరవాత తెలుగు నుంచి పిలుపు అందుకోవడం ఇదే. ఈవారంలోనే ‘ఓజీ’ చిత్రీకరణ మొదలు కానుంది. ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. ఈలోగా మరో సూపర్‌ ఛాన్స్‌ జాన్వీని వరించినట్టు టాక్‌. రాజమౌళి - మహేశ్‌బాబు కలయికలో ఓ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో కథానాయికగా జాన్వీ పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీపికా పదుకొణె పేరు కూడా చర్చల్లో గట్టిగానే వినిపిస్తోంది. అయితే.. జాన్వీని ఫిక్స్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శ్రీలీల పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. యువ హీరోలకు తను పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌. నితిన్‌, రామ్‌ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. మహేశ్‌ సినిమాలోనూ అవకాశం అందుకొంది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో జోడీ కట్టబోతున్నట్టు టాక్‌. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రానుంది. ఇందులో శ్రీలీలని కథానాయికగా ఎంచుకొన్నార్ట. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తరవాత ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి తనకు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ నటించబోతున్నాడన్న ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో హృతిక్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించనున్నారు. ఇందులో కథానాయికగా అలియాభట్‌ని ఎంచుకొన్నార్ట. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అలియా కథానాయికగా నటించింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో మంచి దోస్తీ కూడా కుదిరింది. ఇప్పుడు తొలిసారి వీరి జోడీని చూడబోతున్నామన్నమాట.

Updated Date - 2023-04-12T07:53:04+05:30 IST