CM Revanth Reddy: నేను సీఎంగా ఉన్నంతకాలం.. సినిమా వాళ్లకు!
ABN , Publish Date - Dec 21 , 2024 | 06:10 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం అసెంబ్లీలో ఆయన సుధీర్ఘ ప్రసంగం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పారు. తాము అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వనని వార్నింగ్ ఇచ్చారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి.. కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం ఊరుకోమని తేల్చి చెప్పారు. చట్టం అందరికీ ఒక్కటే అనే విషయం గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
అంతకు ముందు స్టార్ హీరోల సినిమా విడుదల సమయంలో డ్రగ్స్పై అవగాహన కల్పిస్తేనే టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటతో.. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరల పెంపుకానీ, బెనిఫిట్ షోలు కానీ ఉండవని స్పష్టం చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
ఇంకా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ప్రవర్తించాయి. పలువురు నాయకులు నాపై అడ్డదిడ్డమైన కామెంట్స్ చేశారు. నీచంగా తిట్టుకుంటూ పోస్టులు పెట్టారు. మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి అడ్డగోలుగా పోస్టులు పెట్టారు. సదరు హీరో భగవత్ స్వరూపుడు అన్నట్లుగా హంగామా చేశారు. ముఖ్యమంత్రిని తిట్టడానికి చాలా నీచమైన భాషను వాడారు. ప్రజల ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్లను ఏం చేయవద్దా? స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, సూపర్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? సినిమా వాళ్లు హత్యలు చేసినా విచారణ చేయొద్దంటూ చట్టం చేద్దామా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.