Tollywood Box Office: మే 31న ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలిస్తే షాకవుతారు

ABN , Publish Date - May 14 , 2024 | 06:07 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి, ఐపీఎల్ కూడా ఈనెల 26తో అయిపోతుంది, అందుకని చిత్ర నిర్వాహకులు మే 31న తమ సినిమాలు అన్నీ విడుదల చెయ్యడానికి సంసిద్ధులై వున్నారు. మే 31న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి, మరి ప్రేక్షకులు ఈసారైనా సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వస్తారా? వేచి చూడాల్సిందే...

Tollywood Box Office: మే 31న ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలిస్తే షాకవుతారు
Many of the Telugu films are releasing on May 31

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి, ఇక ఫలితాల కోసమే ఎదురుచూపులు. అయితే ఎండలు అలానే వున్నాయి, ఐపీఎల్ ఇప్పుడే చివరి దశకు చేరుకుంటోంది. మే 26 ఆదివారం ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది, ఆరోజుతో ఈ టోర్నమెంట్ కూడా పూర్తయినట్టే. ఇన్ని అడ్డంకులు వున్నప్పుడు ఇప్పుడెందుకు విడుదల చెయ్యడం, ఇవన్నీ అయిపోయాక, అంటే మే 31 న విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు అని చిత్ర నిర్వాహకులు ఆరోజు విడుదలకి పెట్టుకున్నారు.

vishwaksengangsof.jpg

ఇంతకీ మే 31న ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా? సుమారు అరడజనుకి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' వుంది. కృష్ణ చైతన్య దర్శకుడు, సితార ఎంటర్ టైనమెంట్స్ నిర్మాత. అంజలి, నేహా శెట్టి కథానాయకురాళ్లుగా నటించిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తూ చివరికి మే 31వ తేదీ ఖరారు చేశారు.

haromahara.jpg

సుధీర్ బాబు ఎంతో ఆశలు పెట్టుకున్న 'హరోం హర' తన మామయ్యగారు, సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదలవుతోంది. ఈ సినిమాకి 'సెహరి' ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, సునీల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. సుధీర్ బాబు మంచి విజయం సాధించి చాలా సంవత్సరాలు అవుతోంది. అతను నటించిన 'నన్ను దోచుకుందువటే' 2018లో విడుదలైంది, ఈ సినిమాకి కొంచెం మంచి పేరొచ్చింది. అంతే, ఆ తరువాత సుధీర్ బాబు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది.

bhajevayuvegam.jpg

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా 'భజే వాయు వేగం' అనే సినిమా కూడా మే 31న విడుదలవుతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు కాగా, ఐశ్వర్య మీనన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకి నిర్మాతలు. ఇంకో సినిమా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యభామ' కూడా ఇదే రోజు విడుదలవుతోంది. సుమన్ చిక్కాల దర్శకుడు, నవీన్ చంద్ర ఇంకో ప్రధాన పాత్రలో కనపడతారు. కాజల్ ఇందులో పోలీసు ఆఫీసరుగా కనపడుతోంది.'గూఢచారి', 'మేజర్' సినిమాల దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి సమర్పకుడిగా, అలాగే ఈ సినిమాకి కథనం కూడా ఇస్తున్నారు.

kajalagarwalsatyabhama.jpg

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన 'గం గం గణేశ' సినిమా మే 31న విడుదలవుతోంది. దీనికి ఉదయ్ శెట్టి దర్శకుడు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది, కానీ సరైన తేదీ కోసం ఎదురుచూస్తూ విడుదల వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సరైన సమయం అని ఈ నెల మే 31న విడుదలకి సర్వం సిద్ధం చేశారు. 'బేబీ' సినిమా తరువాత వస్తున్న ఆనంద్ దేవరకొండ సినిమా ఈ 'గం గం గణేశ' అవటం ఆసక్తికరం. ఈ సినిమాలే కాకుండా 'మ్యూజిక్ షాప్ మూర్తి' అనే సినిమా కూడా విడుదలవుతోంది. ఇందులో చాందిని చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తోంది. అజయ్ ఘోష్ ఇంకో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పాలడుగు శివ ఈ సినిమాకి రచన, దర్శకత్వం చేశారు.

Updated Date - May 14 , 2024 | 06:07 PM