Priyanka Chopra: చిలుకూరు బాలాజీ టెంపుల్లో పూజలు.. ఉపాసనకు థ్యాంక్స్
ABN, Publish Date - Jan 21 , 2025 | 07:33 PM
ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ అండ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా.. తాజాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ని విజిట్ చేసినట్లుగా చెబుతూ.. తన ఇన్స్టా అకౌంట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. అంతే కాదు, మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. విషయంలోకి వస్తే..
బాలీవుడ్ అండ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హైదరాబాద్లో సందడి చేస్తోంది. రీసెంట్గా రాజమౌళి అండ్ టీమ్తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ప్రియాంకా చోప్రాది వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమెని అలా చూసి.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతోన్న సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రానే అనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అసలెందుకు వాళ్లు అలా కలిశారో కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రియంకా చోప్రా ప్రత్యేక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..
హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రియాంకా చోప్రా ప్రత్యేకంగా పూజలు నిర్వహించింది. ప్రదక్షణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకుంది. ప్రియాంకా చోప్రాకు పూజారులు శేష వస్త్రంతో గౌరవించారు. ఈ టెంపుల్ విజిట్కు సంబంధించిన ఫొటోలను ప్రియంకా చోప్రా తాజాగా తన ఇన్స్ట్రాగ్రమ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆలయ ఆవరణలో తను ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన ప్రియాంకా చోప్రా..
‘‘శ్రీ బాలాజీ ఆశీస్సులతో కొత్త అధ్యాయం మొదలైంది. మనమందరం మన హృదయాల్లో శాంతిని నింపుకొని, మన చుట్టూ సమృద్ధి, సౌభాగ్యాలతో గడపాలి. దేవుడి దయ అనంతం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్యూ ఉపాసన కొణిదెల” అని తన పోస్ట్లో పేర్కొంది. అంటే ఈ టెంపుల్ విజిట్కు ఉపాసన హెల్ప్ చేసి ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు. అందునా ప్రియాంకా చోప్రాకు, రామ్ చరణ్కు మధ్య మంచి స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరూ ‘జంజీర్’ అనే మూవీలో కలిసి నటించారు కూడా. అలాగే RRR మూవీకి ఆస్కార్ అవార్డ్ రావడంలోనూ ఆమె సపోర్ట్ చేశారు. ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ-ఆస్కార్ పార్టీ ఇచ్చారు.
ప్రియాంకా చోప్రా పోస్ట్కు మెగా కోడలు ఉపాసన కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘మీ నూతన సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని కామెంట్ చేశారు. ఉపాసన చేసిన ఈ కామెంట్తో రాజమౌళి-మహేష్ కాంబో ప్రాజెక్ట్లో హీరోయిన్ ప్రియాంకా చోప్రానే అనేది తెలిసిపోయిందంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.