Rag Mayur: ఒకే రోజు హీరోగా.. విలన్‌గా...టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ

ABN, Publish Date - Feb 04 , 2025 | 12:05 PM

'సినిమా బండి' మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

'సినిమా బండి' (Cinema bandi) మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ (Rag Mayur) ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. జనవరి 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో  విడుదల అయిన  ‘సివరపల్లి’ (Sivarapalli series) అనే వెబ్ సిరీస్ లో రాగ్ మయూర్ హీరో పాత్రలో మెరిశాడు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. నిజానికి ఇది రీమేక్ వెబ్ సిరీసే కానీ ఎక్కడా తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే ఆ పల్లెటూరికి వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడు? ఇష్టం లేని ఉద్యోగం ఎలా చేశాడు? లాంటి విషయాలను ప్రేక్షకులకు చక్కగా చేరువయ్యేలా  తనదైన శైలిలో నటించి మెప్పించారు రాగ్ మయూర్. 


అదే రోజు సుకుమార్ కూతురు కీలక పాత్రలో 'గాంధీ తాత చెట్టు' (Gandhi Thata chettu) సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి మెరిశాడు. చాలా ఈజ్ తో ఎక్కడ నటిస్తున్నాడని భావన రాకుండా ఆ సతీష్  పాత్రలో ఇమిడిపోయాడు. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా వర్క్ అవుట్ అయింది. ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. విమర్శకులి సైతం రాగ్ మయూర్ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్ ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు

Updated Date - Feb 04 , 2025 | 02:03 PM