Maheshbabu: విచారణకు సమయం కావాలి .. మహేష్ రిక్వెస్ట్
ABN, Publish Date - Apr 27 , 2025 | 05:23 PM
సాయి సూర్య, సురానా కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Maheshbabu) నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 28వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
సాయి సూర్య, సురానా కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Maheshbabu) నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 28వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసుల ప్రకారం మహేష్ బాబు సోమవారం ఈడీ (ED) ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈడీ అధికారులకు ఓ విజ్ణప్తి చేశారు. సినిమా షూటింగ్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీ అధికారులకు ఓ మెయిల్ ద్వారా విజ్ణప్తి చేశారు. ఈడీ అధికారులు మహేష్ బాబు విజ్ణప్తిని పరిగణలోకి తీసుకుని సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో రియల్ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో పాటు ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర ఇంట్లో కూడా సోదాలు చేశారు. భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా గ్రూపు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. సురానా అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. (SSMB29)
ప్రమోషన్స్ కింద సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల నుండి మహేష్ బాబు పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా.. మొత్తం రూ. 5.9 కోట్లు తీసుకున్నారని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మహేష్కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఏప్రిల్ 28వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు.