Chiranjeevi: చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:46 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. హౌస్ ఆఫ్ కామన్స్ - యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.
‘పునాదిరాళ్ళు’తో కెరీర్ ప్రారంభించిన చిరు ఎన్నో సవాళ్లుఎదుర్కొని స్టార్గా ఎదిగారు. తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఆకట్టుకున్నారు. రికార్డులు క్రియేట్ చేశారు. ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఎ.ఎన్.ఆర్ శత జయంతి సందర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా, అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నారు చిరు.