Odele 2 Movie: సరికొత్త అనుభూతినిస్తుంది

ABN, Publish Date - Apr 15 , 2025 | 04:30 AM

ఓదెల రైల్వేస్టేషన్‌కి సీక్వెల్‌గా రూపొందిన ఓదెల 2 చిత్రంలో తమన్నా శక్తిమంతమైన నాగసాధు పాత్రలో కనిపించనుంది. సంపత్‌నంది కథ అందించి, అశోక్‌ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 17న విడుదలవుతోంది

  • సంపత్‌నంది

దర్శకుడు సంపత్‌నంది దర్శకత్వ పర్వవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2’. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ చిత్రానికి సంపత్‌నంది కథను అందించి సమర్పకుడిగా వ్యవహరించారు. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు నిర్మించారు. ఈ నెల 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సంపత్‌నంది. ‘‘ఈ సినిమా మొదటి భాగం తీస్తునప్పుడు పార్ట్‌ 2 గురించి ఆలోచించలేదు. కానీ చివరలో లీడ్‌ అయితే ఇచ్చాం. మొదటి భాగంలో హెబ్బా క్యారెక్టర్‌ సినిమాకే ప్లస్‌ అయ్యింది. అందుకే ఇందులో దుష్టశక్తితో పోరాడేందుకు ఓ బలమైన ఫిమేల్‌ క్యారెక్టర్‌ ఉంటే బాగుంటుందనిపించి తమన్నా పాత్రను సృష్టించాం. ఓ ఆత్మకు, సూపర్‌ నేచురల్‌ పవర్స్‌కు మధ్య జరిగే ఆసక్తికరమైన పోరు ఈ సినిమా కథాంశం. ప్రేక్షకులకు సరికొత్త విజువల్‌ అనుభూతిని పంచుతుంది. ఈ కథను రాసేందుకు చాలా పరిశోధన చేశాం. శివశక్తి, నాగసాధువులుగా మారతారని, శివాలయాలను శుద్ధి చేస్తారని.. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ క్రమంలోనే ఈ సినిమాలో శక్తిమంతమైన నాగసాధు పాత్ర తయారైంది. తమన్నా ఇందులో తన లుక్‌ కోసం చాలా శ్రమించారు. సినిమాలో గ్రాఫిక్స్‌ పార్ట్‌ అధికంగా ఉంటుంది. ఆ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతాయి. దర్శకుడు అశోక్‌ ప్రతిభావంతుడు. ఆయన మేకింగ్‌ అదిరిపోతుంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 15 , 2025 | 04:33 AM