Harsha Sai: హర్షసాయిపై మరో ఫిర్యాదు

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:04 PM

ఇప్ప‌టికే యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని గంటలుగా హర్ష వేధిస్తున్నాడంటూ బాధితురాలు మ‌రో ఫిర్యాదు చేసింది.

harsha

యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ యూట్యూబర్(YouTuber) హర్ష సాయి (Harsha Sai) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్షసాయిపై బాధితురాలు గురువారం మరో ఫిర్యాదు చేశారు. హర్ష తనకు కొన్ని గంటలుగా ఈ మెయిళ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఇదే పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

హర్షపై లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు.

మరోవైపు ‘మెగా’ సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగికంగా వేధించారని బాధితురాలు తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు. హర్షసాయిపై మంగళవారం కేసు నమోదయ్యింది.తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ సదరు యువతి తన న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితురాలి నుంచి కొన్ని ఆధారాలు సేకరించి మరిన్ని ఆధారాలు సమర్పించాలని కోరారు. ఈ క్ర‌మంలో హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

Updated Date - Sep 26 , 2024 | 04:06 PM