Jani Master - National award: సినిమా వాళ్లకు ఓ రూలు.. రాజకీయాలకు మరో రూలా

ABN, Publish Date - Oct 06 , 2024 | 05:30 PM

టాలీవుడ్‌లోనే కాకుండా నార్త్‌, సౌత్‌ సినీ ఇండస్ట్రీల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani master). ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఈ ఏడాడి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు

టాలీవుడ్‌లోనే కాకుండా నార్త్‌, సౌత్‌ సినీ ఇండస్ట్రీల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani master). ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఈ ఏడాడి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. 'తిరు చిత్రంబలం’ చిత్రానికి గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. అయితే ఇప్పుడా అవార్డును తాత్కాలికరంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ సెల్‌ ప్రకటించింది. జానీ మాస్టర్‌ పై పోక్సో కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ నిర్దోషిగా బయటకు వస్తే ఆ అవార్డుని జానీ మాస్టర్‌కు అందజేస్తారు.  అయితే జానీ మాస్టర్‌కు అవార్డును (Award Cancel)నిలిపేస్తున్నట్లు శనివారం ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. (Fans and netizens Fire)

వృత్తిగత జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య లింకేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. జానీ బెస్ట్‌ డాన్స్‌ మాస్టర్‌ అనేది ఓ కమిటీ నిర్ణయించింది. దాని ద్వారానే అవార్డు ప్రకటించింది. మధ్యలో ఈ కేసు వివాదం బయటకు వచ్చింది. ఒకవేళ అప్పటికే జానీ మాస్టర్‌కు అవార్డు ఇచ్చేేస్త, ఆ తరవాతే కేసు సంగతి బయటకు వస్తే అప్పుడు అవార్డు వెనక్కి లాక్కునేవారా? ఇప్పటి వరకూ ఇచ్చిన అవార్డుల్లో అలా జరిగిందా?  జాతీయ అవార్డు కమిటీ వెనక్కి లాక్కోగలిగిందా? ఇక మీదట జాతీయ అవార్డులకు నామినేషన్లు పంపేటప్పుడు క్లీన్‌ చిట్‌ పత్రాలు కూడా జత చేయాలా? ఆ అవసరాన్ని ఇప్పుడు జాతీయ అవార్డు కమిటీ కల్పించిందా? ఇవన్నీ ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలు. జాతీయ అవార్డుకు అర్హులు కావాలంటే ఈ రూల్స్‌ అన్ని ఉండాలా? అని సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు.

సినిమా రంగం వాళ్లనే ఇలా ఎందుకు టార్గెట్‌ చేస్తారు? సినిమా వాడిని ఎవరైనా, ఎలాగైనా ఎక్కడైనా కార్నర్‌ చేయగలరు. అందుకు జానీ ఉదంతం ఓ నిదర్శనం. జానీ మాస్టర్‌ ఎంత కష్టపడితే ఈజాతీయ పురస్కారానికి ఎంపికై ఉంటాడు. అతని టైమ్‌ బావుండి అవార్డును ప్రకటించారు. ఇప్పుడు ఓ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అవార్డును తాత్కాలికంగా నిలిపేశారు. నిర్దోషి అని తేలితే అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్లీ అవార్డు ఇస్తాం అంటే ఇప్పటి కళ, ఇప్పటి గౌరవం అప్పుడు ఉంటుందా? ఒకవేళ మళ్లీ ఆహ్వానం అందితే ప్రకటించినప్పుడు ఉన్న సంతోషంతో అప్పుడు జానీ వెళ్ళగలడా? అంటూ జాతీయ అవార్డు కమిటీకి చురకలు అంటిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాయకులకు ఈ ఆప్షన్‌ ఎందుకు లేదు? వాళ్లపై కేసులు నమోదైతే.. కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, నిజాయతీ నిరూపించుకొన్న తరవాతే పదవుల్లోకి రండి, ప్రజల్ని పరిపాలించండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సినిమా వాళ్లకు ఓ రూలు, రాజకీయాలకు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయంపై కొరియోగ్రాఫర్‌ 'ఆట’ సందీప్‌ స్పందించారు. "ఎంతో కష్టపడితే గానీ నేషనల్‌ అవార్డు దక్కదు. అలాంటి జానీ మాస్టర్‌కు అవార్డు వరించింది. ఏదో కేస్‌ మధ్యలో వచ్చిందని అవార్డును క్యాన్సిల్‌ చేయడం కరెక్ట్‌ కాదు. ఈ మధ్యలో చట్టాలన్నీ అమ్మాయిలకు అనుకూలంగా ఉండడంతో ప్రతి విషయంలోనూ కేసులు పెడుతున్నారు’ అని ఆట సందీప్‌ అన్నారు. జానీ మాస్టర్‌కు మద్దతుగా యానీ మాస్టర్‌ కూడా స్పందించారు.

Updated Date - Oct 06 , 2024 | 05:32 PM