Pawan Kalyan: మోకాళ్ల నొప్పితోనే.. కాలి న‌డ‌క‌న‌ తిరుమ‌ల‌ చేరుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ABN, Publish Date - Oct 01 , 2024 | 11:38 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ త‌ను చేప‌ట్టిన ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు మంగళవారం కాలిన‌డ‌క‌న‌ తిరుమల చేరుకున్నారు.

pawan

అంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఇటీవ‌ల తిర‌మ‌ల ల‌డ్డూ క‌ల్తీ నేప‌థ్యంలో ప్రాయశ్చిత దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సెప్టెంబరు 22 నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉన్న ఆయన తాజాగా ఆ దీక్ష విర‌మించేందుకు గాను పవన్‌ మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించడంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు.

మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో సాయంత్రం 4.50 ప్రాంతంలో అలిపిరి చేరుకుని. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ఠ భద్రత మధ్య పవన్‌ కల్యాణ్‌ స్వ‌యంగా నడక మొదలుపెట్టారు. రెండు మోకీళ్లకు బెల్ట్‌లు (నీ క్యాప్‌) ధరించినప్పటికీ మెట్లు ఎక్కే క్రమంలో పవన్‌లో అలసట కనిపించింది. మధ్యమధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు.

అక్కడ కాళ్ల నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒకదశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళతారన్న ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగా సిబ్బందీ అప్రమత్తం అయ్యారు. అయితే, ఏడో మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి 9.20 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్టాండు వరకు నడిచారు.

అప్పటికే అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండు నుంచి వాహనంలో గాయత్రి సదన్‌కు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. తిరిగి ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకోకున్నారు.

అనంతరం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించి అక్కడి నుంచి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఇదిలాఉండ‌గా.. అక్టోబర్ 3 గురువారం సాయంత్రం సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు తిరుపతి జ్యోతి రావ్ పూలే విగ్రహం ముందు వారాహి సభ నిర్వ‌హించ‌నున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 07:07 AM