Rishab Shetty: సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం

ABN, Publish Date - Sep 28 , 2024 | 12:00 PM

'కాంతార’ (kantara) లాంటి చిన్న చిత్రంతో భారీ విజయం సాధించారు నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) . తాజాగా ఓ వేదికపై బాలీవుడ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

'కాంతార’ (kantara) లాంటి చిన్న చిత్రంతో భారీ విజయం సాధించారు నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) . తాజాగా ఓ వేదికపై బాలీవుడ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందంటూ ఆయన చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆయన బాలీవుడ్‌పై ఏం కామెంట్‌ చేశారంటే.. ‘‘కొన్ని భారతీయ సినిమాలు ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌ వేస్తారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం.. నా రాష్ట్రం.. నా భాష వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’’ (Comments on Bollywood) అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో కొందరు నెటిజన్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఐఫా’ ఉత్సవంలో పాల్గొన్న ఆయనను ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని మీడియా కోరగా ఆయన సమాధానమిచ్చారు.  

‘‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా కామెంట్స్‌ని తిప్పి రాశారు. నా ఉద్దేశం అది కాదు. తప్పకుండా ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం’’ అని అన్నారు. అబుదాబి వేదికపై జరిగి ‘ఐఫా’ వేడుకల్లో ‘ఔట్‌ స్టాండింగ్‌ ఎక్సెలెన్స్‌ ఇన్‌ కన్నడ సినిమా’ (Outstanding excellence in Kannada Cinema) అవార్డును రిషబ్‌ శెట్టి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "తనపై అభిమానం చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేలా మరెన్నో చిత్రాలు అందిస్తాను" అన్నారు. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’. 2022లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించి సంచలనం సృష్టించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రూ.450 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సిద్థమవుతోంది. చిత్రీకరణ దశలో ఉంది. దీనికోసం రిషబ్‌ కలరియపట్టు యుద్థ విద్యలో గత కొన్నాళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్నారు.  

Updated Date - Sep 28 , 2024 | 12:05 PM