Hero Simbu: వరద బాధితులకు విరాళం.. స్పందించిన తొలి తమిళ హీరో

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:54 PM

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సినీ తారలు అండగా నిలిచారు. భారీగా విరాళాలు అందించారు. ఇప్పుడు తమిళస్టార్‌ శింబు కూడా ఇందులో భాగమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు (Flood victims) సినీ తారలు అండగా నిలిచారు. భారీగా విరాళాలు అందించారు. ఇప్పుడు తమిళస్టార్‌ శింబు (Simbu) కూడా ఇందులో భాగమయ్యారు. భాషా భేదం లేకుండా తన పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తనను అభిమానించే తెలుగు ప్రజల కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రూ. 6 లక్షలు రెండు రాష్ట్రాల (Simbu Donation) ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళ ఇండస్ట్రీ నుంచి స్పందించిన తొలి హీరోగా నిలిచారు శింబు.

శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన నటించిన చిత్రాలెన్నో తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల శింబు సినిమాలు తక్కువగా చేస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా వస్తున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నవంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ లో కూడా శింబు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆయన నెగటివ్‌ షేడున్న పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.


పారితోషికం విరాళంగా?
అయితే ఈ విరాళం ఇవ్వడానికి మరో కారణం చెబుతున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఓజీ (OG) చిత్రం కోసం ఓ పాట పాడారట. దానికి రెమ్యూనరేషన్‌గా డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఆరు లక్షలు ఇవ్వగా, శింబు పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో పారితోషికాన్ని తిరస్కరించారని టాక్‌. ఫైనల్‌గా ఆ మొత్తాన్ని ఆయన అంగీకారంతో తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్ధం వినియోగించినట్లు టాక్‌ నడుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

Updated Date - Sep 10 , 2024 | 04:15 PM