Demonte Colony2: మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారా? పాయింట్‌తో ‘డిమాంటి కాలనీ-2’

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:36 PM

మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారా? అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని ‘డిమాంటి కాలనీ-2’ సినిమా తీశామని ఆ చిత్ర దర్శకుడు అజయ్‌ ఙ్ఞానముత్తు అన్నారు. ఈ నెల 15న ఈ చిత్రం త‌మిళంలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మీడియాతో ముచ్చటించింది.

Demonte Colony2

మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారా? అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని ‘డిమాంటి కాలనీ-2’ (Demonte Colony 2) సినిమా తీశామని ఆ చిత్ర దర్శకుడు అజయ్‌ ఙ్ఞానముత్తు (Ajay R Gnanamuthu) అన్నారు. అరుళ్‌ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోహీరోయిన్లుగా నటించగా, అరుణ్‌పాండ్యన్‌, మీనాక్షి గోవిందరాజన్‌, అర్చన, ముత్తుకుమార్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు బాబీ బాలచంద్రన్‌, విజయసుబ్రమణియన్‌, ఆర్‌సీ రాజ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మీడియాతో ముచ్చటించింది.

దర్శకుడు అజయ్‌ ఙ్ఞానముత్తు (Ajay R Gnanamuthu) మాట్లాడుతూ, ‘ఇది 2015లో వచ్చిన హార్రర్‌ డ్రామా ‘డీమాంటి కాలనీ’కి సీక్వెల్‌. తొలి భాగంలో అందులోని వారంతా చనిపోతారు. ఆ క్లైమాక్స్‌లో వదిలేసిన చిన్న పాయింట్‌ ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించాం. చనిపోయిన మననుషులు మళ్ళీ జన్మిస్తారా? అన్నది ప్రధాన పాయింట్‌. తొలిభాగం స్టోరీకి ముందు ప్రీ సీక్వెల్‌ ఉంటుంది. దానికి, ఇపుడు రెండో భాగానికి లింక్‌ చేస్తూ ఈ సీక్వెల్‌ కొనసాగుతుంది’ అన్నారు.


హీరో అరుళ్‌నిధి (Arulnithi) మాట్లాడుతూ, ‘ఇందులోని దెయ్యం సినిమాల్లో ఇప్పటివరకు చూసిన దెయ్యంలా ఉండదు. కొత్త అనుభూతిని కలిగించే దెయ్యం. ఎంతో భయానకంగా సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌ప్లే కొనసాగుతుంది’ అన్నారు. హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగావచ్చింది. మీడియా సపోర్ట్‌ చేయాలని’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఈ నెల 15న తమిళనాడులో 300కు పైగా స్క్రీన్లలో రెడ్‌ జెయింట్‌ మూవీస్‌, అమెరికా, మలేసియా, సింగపూర్‌ తదితర దేశాల్లో టెంట్‌కొట్టాయ్‌ రిలీజ్‌ చేస్తుంది’ అని తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 04:36 PM