Rao Ramesh: ఏపీ అభివృద్ధిలో భాగమైన నటుడు రావు రమేష్.. ఆ నియోజకవర్గానికి విరాళం

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:27 PM

రావు రమేష్.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తన తండ్రి, లెజండరీ యాక్టర్ రావు గోపాలరావులోని విలక్షణతను పుణికిపుచ్చుకున్న రావు రమేష్.. ప్రస్తుతం స్టార్ట్ ఆర్టిస్ట్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడాయన ఏపీ అభివృద్ధిలో భాగమయ్యేందుకు చేతులు కలిపారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ఆర్ఆర్ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రావు రమేష్ రూ. 3 లక్షల విరాళం అందచేశారు.

Actor Rao Ramesh

రావు రమేష్.. (Rao Ramesh) ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తన తండ్రి, లెజండరీ యాక్టర్ రావు గోపాలరావు (Rao Gopala Rao)లోని విలక్షణతను పుణికిపుచ్చుకున్న రావు రమేష్.. ప్రస్తుతం స్టార్ట్ ఆర్టిస్ట్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే స్థాయిలో రావు రమేష్ తన విభిన్నతమైన నటనా పటిమను చాటుకుంటున్నారు. ఇప్పుడాయన ఏపీ అభివృద్ధిలో భాగమయ్యేందుకు చేతులు కలపడంతో.. టాలీవుడ్‌లోనే కాకుండా సోషల్ మీడియా అంతా రావు రమేష్ పేరు వైరల్ అవుతుంది. అదెలా అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే..

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ర‌ఘురామ కృష్ణం రాజు (RRR).. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం Drainage Maintenance Infrastructure Fund, Undi పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళంగా అందచేశారు. తన సంపాదనలో కొంత సమాజ సేవకు వినియోగించే రావు రమేష్.. ఆయన చేసే సేవ గురించి బయటకు తెలియనివ్వరు. ఇది ఇండస్ట్రీలో ఆయనకు దగ్గరకు ఉండేవారికి మాత్రమే తెలిసిన విషయం. ఇప్పుడు కూడా రూ. 3 లక్షలు విరాళం విషయం ఆయన చెప్పలేదు. ఆ విరాళం అందుకున్న ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణం రాజు (Raghu Ramakrishna Raju) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఒక్కసారి రావు రమేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read- NTR Film Awards: బెస్ట్ హీరో ఆనంద్ దేవరకొండ.. బెస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్


‘‘ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ‘Drainage Maintenance Infrastructure Fund, UNDI’ నిధికి రూ. 3,00,000 లు విరాళం అందించిన ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను..’’ అంటూ ర‌ఘురామ కృష్ణం రాజు సోషల్ మీడియా వేదికగా రావు రమేష్ చెక్ అందిస్తోన్న ఫొటోలను షేర్ చేశారు. అంతే.. రావు రమేష్‌ది తన తండ్రిలానే గొప్ప మనసు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో భాగమైన మీకు థ్యాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ర‌ఘురామ కృష్ణం రాజు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 30 , 2024 | 09:27 PM