Devara Review: తారక్ నటించిన 'దేవర' ఎలా ఉందంటే

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:20 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర.

సినిమా రివ్యూ: దేవర –1
విడుదల తేదీ: 27–9–2024
నటీనటులు: జూ.ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, శ్రీకాంత్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతీ మరాఠే, అజయ్‌, షైన్‌ టామ్‌ చాకో, అభిమన్యుసింగ్‌, మురళీ శర్మ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
సంగీతం: అనిరుద్థ్‌ రవిచంద్రన్‌
సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్‌
నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్‌, హరీష్‌ కొసరాజు
దర్శకత్వం: కొరటాల శివ

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర. సక్సెస్‌ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్‌ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు అంతే ఆతురతగా ఎదురుచూశారు. 'ఆచార్య’ ఫెయిల్యూర్‌ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆయన కూడా కాస్త జాగ్రత్తగా హిట్‌ కొట్టాలనే కసితో పనిచేశారు. అయితే పాటలు అలరించినా ట్రైలర్‌ మాత్రం అభిమానుల్ని నిరుత్సాహపరచడంతో అంచనాలు కాస్త అటు ఇటు అయ్యాయి. దాంతో విడుదలకు మూడు రోజులు ముందు రిలీజ్‌ ట్రైలర్‌ పేరుతో మరో ట్రైలర్‌ వదిలారు. అది సినిమాపై అంచనాలు పంచేలా చేసింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది. కొరటాల ఖాతాలో హిట్‌ పడిందా లేదా అన్నది చూద్దాం. 

కథ:
ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. బ్రిటీష్‌ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం మురుగ (మురళీ శర్మ) కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురగ దగ్గర పని చేయకూడదని, మరో మార్గంలో పని చేసుకుందామని చెబుతాడు. అందుకు భైర (సైఫ్‌ అలీఖాన్‌) అంగీకరించడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం మొదలవుతుంది. దేవర మాత్రం ఊరికి దూరంగా ఉంటూ సంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తాడు. దాంతో దేవర ప్రాణం తీయడానికి పన్నాగం పన్నుతాడు భైర. ఆ తర్వాత ఏం జరిగింది. అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవర కోసం భయం భయంగా ఉండే వర (ఎన్టీఆర్‌) ఏం చేశాడు. అసలు రత్నగిరి, ఎర్ర సముద్రంలో ఏం జరిగింది అనేది  కథ.  



విశ్లేషణ:
రత్నగిరి అనే ప్రాంతంలో సముద్రం, అందులో జరిగే వ్యాపారం, ఆ ప్రాంతంలో బతుకుతెరువు కోసం పనిచేసే మనుషులు ఇతివృత్తంగా సాగే కథ ఇది. బ్రిటీష్‌ కాలం, ఎర్ర సముద్రం, ఆ ప్రాంత వాసుల ఘనత, ఆ సముద్రానికి కాపలాగా ఉండే దేవర కథను ఓ కేసును చేధించడం కోసం వచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌ (అజయ్‌)కు సింగప్ప (ప్రకాశ్‌రాజ్‌)తో చెప్పిస్తూ కథను నడిపించారు. ఫస్టాఫ్‌ అంతా ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, పోరాటాలు, రత్నగిరిలో జాతర, ఆయుధ పూజ నేపథ్యంలో సాగుతాయి. ప్రతి సన్నివేశంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ నుంచి కథ ట్రాక్‌ తప్పిన ఫీల్‌ కలుగుతుంది. అప్పటి వరకూ 'అక్రమ ఆయుధాల రావాణాకు పని చేస్తున్నాం' అనే విషయం తెలియక ఆ పనిని వదిలేసి, కొత్త జీవితం మొదలు పెట్టాలనుకోవడం, అందుకు భైర అండ్‌ కో అంగీకరించపోవడం అంతా బాగానే సాగింది. దేవరను చంపాలనే స్కెచ్‌ వేసి దెబ్బ తిన్న భైర బృందం, సంద్రానికి కాపలాగా నేనుంటాను అని చెప్పి దేవర అజ్ఞాతంలోకి వెళ్లడం నుంచి కథ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ అంతా చకచకా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో వర, తంగం పాత్రలు పరిచయం అవుతాయి. వారి మధ్య చిన్న లవ్‌ ట్రాక్‌ నడుస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న ఇంటెన్స్‌ సెకెండాఫ్‌లో ఉండదు. దేవర అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి ప్రతి సన్నివేశం ఊహకు అందేలా ఉంటుంది. భయం భయంగా కనిపించే వర ఆయుధ పూజ కోసం బరిలోకి దిగినప్పుడే తండ్రి స్థానంలో ఉండి అంతా చేసేది అతనే అని అర్థమైపోతుంది. దేవర పాత్ర ముగింపు, వర పాత్ర మళ్లీ ఎలా మొదలైంది, భైరను ఎలా అంతమొందించాలన్నది రెండో పార్ట్‌లో చూడాలి అన్నట్లు ముగింపు పలికారు. దర్శకుడు కొరటాల శివ బలం రచన. తను తెరకెక్కించిన హిట్‌ చిత్రాలు చూస్తే.. కథలో బలం కనిపిస్తుంది. ఈ కథలో బలమున్నప్పటికీ ఆయనలోని రచయిత సీన్స్‌ రాయడం, స్ర్కీన్‌ప్లే రాయడంలో ఎక్కడో ఫెయిల్‌ అయిన భావన కలుగుతుంది. ఆయన సినిమాల్లో ఉండే కొత్తదనం ఈ చిత్రంలో మిస్‌ అయింది. ఇంటర్వెల్‌ నుంచి ప్రతి సీనూ ఊహించేలా ఉంది.  అయితే తారక్‌ నటన, పోరాటాలు, అనిరుద్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌గా నిలిచాయి. డైలాగ్‌ల విషయంలోనూ కొరటాల మార్క్‌ మిస్‌ అయింది. ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని, సెప్పినాడంటే..’ భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి..’ ుజరిగిన పొరపాటుకు  కళ్లలోకి చూసి మాట్లాడలేక.. కాళ్లను చూసి మాట్లాడుతున్నా’ వంటి డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు, ఈలలు వేయిస్తాయి. పోరాట ఘట్టాలు ఎన్టీఆర్‌ స్టామినాకు తగ్గట్లు ఉన్నాయి. ఆ సముద్రానికి రారాజుగా ఎన్టీఆర్‌ పాత్రను చూపించారు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తాయి. సమ ఉజ్జీలాంటి రెండు పాత్రలను పవర్‌ఫుల్‌గా తెరపై చూపించారు. మనిషి బతకడానికి సరిపడినంత ధైర్యం చాలు... అంతకు మించి ఉన్నా మనిషికి హాని చేస్తుందన్న విషయాన్ని చెప్పారు.



నటీనటుల విషయానికొస్తే..
తారక్‌ డ్యూయల్‌ రోల్‌ చేసిన ఐదో చిత్రమిది. ఇందులో దేవరగా తండ్రి పాత్రలో, 'వర’గా యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. దేవర పాత్రలో తారక్‌ బాడీ లాంగ్వేజ్‌, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. తారక్‌ స్టార్‌ మాత్రమే కాదు.. మంచి నటుడు అని మరోసారి నిరూపించాడు. ఆరేళ్ల తర్వాత తారక్‌ సోలోగా కనిపించిన ఆయన నటన పరంగా అభిమానులకు ఫుల్‌మీల్స్‌ పెట్టారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌కు తెలుగులో తొలి చిత్రమిది. ఆమె పాత్ర గురించి మొదటి నుంచీ మాంచి ఎలివేషన్‌ ఇచ్చారు కానీ మూడు సీన్లు, ఓ పాటలకు పరిమితమైంది. సినిమా మొత్తం మీద ఓ 15 నిమిషాలే కనిపించింది. పాత్ర నిడివి తక్కువే అయినా నటనతో ఆకట్టుకుంది. గ్లామర్‌తో మెప్పించింది. విలన్‌గా భైర పాత్రలో కనిపించారు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌. సినిమాకు కీలకమైన పాత్రే కానీ ఆయనే చేయాల్సిన పాత్ర అయితే కాదు. అయితే హిందీ మార్కెట్‌ కోసం సైఫ్‌, జాన్వీలను ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. సింగప్ప పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ నటన బాగానే ఉంది కానీ అతని గెటప్‌ అంతగా ఆకట్టుకోలేదు. శ్రీకాంత్‌, మురళీశర్మ, అజయ్‌, శ్రుతి  తదతరులు కీలక పాత్రల్లో పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌,  ప్రొడక్షన్‌ డిజైన్‌, క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అండర్‌ వాటర్‌ సీన్స్‌కు బాగా ఖర్చు చేసినట్లు తెరపై కనిపిస్తోంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకి హైలైట్‌. సంగీత దర్శకుడు అనిరుద్‌  నేపథ్య సంగీతంతో అలరించాడు. పోరాట ఘట్టాలు వాటికి నేపథ్య సంగీతం విషయంలో అనిరుద్‌ 100 శాతం న్యాయం చేశాడు. విజువల్‌గా పాటలు ఆకట్టుకున్నాయి. దావూదీ పాట సినిమాలో మిస్‌ అయింది.  కొరటాల శివ బలం రచన, ఆయన ఎన్టీఆర్‌తో చేసిన 'జనతా గ్యారేజ్‌’లో మాటలతో మెస్మరైజ్‌ చేశారు. ఇందులో పూర్తి స్థాయిలో ఆయన రైటింగ్‌ మార్క్‌ మిస్‌ అయింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను చేరుకునే స్థాయిలో సినిమా లేదు. ఈ చిత్రంలో కొరటాల శివ గత చిత్రాల సన్నివేశాల పోలికలున్నాయి. ఆయన రచనపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే అవుట్‌పుట్‌ మరోలా ఉండేది.  తారక్ రెగ్యులర్ గా చేసే మాస్ మసాలా సినిమా కాదిది. 
కొరటాల మార్క్‌ సినిమా అంతకన్నా కాదు. సినిమాపై అంచనాలు పెట్టుకోకుండా తారక్‌ నటన, పోరాటాలు, నేపథ్య సంగీతం కోసం చూడొచ్చు. 


ట్యాగ్‌లైన్‌: దేవర అభిమానుల కోసం మాత్రమే!

Updated Date - Sep 27 , 2024 | 09:40 AM