రాజ్తరుణ్ గర్ల్ఫ్రెండ్ బెదిరిస్తోంది
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:40 AM
నటుడు రాజ్తరుణ్ గర్ల్ఫ్రెండ్ లావణ్య తనకు, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. బెదిరిస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. నటి మాల్వి మల్హోత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు..
పోలీసులకు నటి మాల్వి ఫిర్యాదు
నార్సింగ్ ఠాణాకు మరోసారి లావణ్య
నటుడు రాజ్తరుణ్ గర్ల్ఫ్రెండ్ లావణ్య తనకు, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. బెదిరిస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. నటి మాల్వి మల్హోత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన మాల్వి కుటుంబం ముంబైలో ఉంటోంది. రాజ్తరుణ్ చిత్రం ‘తిరగబడరా స్వామి’ చిత్రంలో మాల్వి కథానాయికగా నటించారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆమె టోలిచౌకిలో ఉంటున్నారు. రాజ్తరుణ్తో వివాదం నేపథ్యంలో లావణ్య పదేపదే తన పేరును ప్రస్తావిస్తున్నారని.. తనకు, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ మాల్వి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. అయితే.. మాల్వి ఉంటున్నది తమ పరిధి కాకపోవడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును రాయదుర్గం ఠాణాకు బదిలీ చేశారు. కాగా.. లావణ్య బుధవారం మరోమారు రాజ్తరుణ్పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఆమె తొలిసారి ఫిర్యాదు చేయగా.. పోలీసులు తగిన ఆధారాలను సమర్పించాలని కోరారు. దాంతో బుధవారం మరోమారు ఠాణాకు వచ్చిన లావణ్య.. పలు ఆధారాలను సమర్పించారు. వీటిల్లో 170 ఫొటోలు, సాంకేతిక ఆధారాలు, తనకు అబార్షన్ చేయించిన ఆస్పత్రి రికార్డులు ఉన్నాయి.
దీంతోపాటు.. అన్విక పేరుతో తాను, రాజ్తరుణ్ విదేశాలకు వెళ్లిన ఆధారాలను సమర్పించారు. ‘‘పదేళ్లుగా నాతో కాపురం చేసిన రాజ్తరుణ్ ఇప్పుడు వదిలేస్తున్నాడు. చాలా సార్లు నా వాయిస్ కాల్స్ను రికార్డ్ చేశాడు. అది చట్టవిరుద్ధం. దానిపైనా చర్యలు తీసుకోండి. ఇప్పుడు రాజ్తరుణ్ మాల్వితో కలిసి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. వెంటనే చర్యలు తీసుకోండి’’ అని ఆ ఫిర్యాదులో పోలీసులను కోరారు. తనను పెళ్లి చేసుకుని, మరొకరితో తిరుగుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్, నార్సింగ్ (ఆంధ్రజ్యోతి)