Samantha: సమంత వాళ్ళ దర్శకత్వంలోనే చేస్తోంది, ఇందుకేనా?

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:22 PM

సమంత కేవలం రాజ్ డీకేలు దర్శకత్వంలో మాత్రమే వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇంతకు ముందు ఆమె నటించిన 'ఫ్యామిలీ మాన్', 'సిటాడెల్: బన్నీ హనీ' వెబ్ సిరీస్ లు వీళ్ళిద్దరూ దర్శకత్వం వహించనవే. ఇప్పుడు చేస్తున్న 'రక్తబీజ్' కి వాళ్ళే దర్శకులు, ఎందుకు వాళ్ళ దర్శకత్వంలో నటిస్తోంది అంటే...

Aditya Roy Kapur and Samantha

సమంత రుత్ ప్రభు ఇంకో వెబ్ సిరీస్ చేస్తోంది అని వార్తలు వచ్చాయి. రాజ్ డీకేలు దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ కథానాయకుడు అని ఈ వార్త. సమంత ఇంతకు ముందు ప్యామిలీ మాన్' వెబ్ సిరీస్ చేసింది, తరువాత 'సిటాడెల్' కి ఇండియన్ వెర్షన్ అయిన 'సిటాడెల్: హానీ బన్నీ' వెబ్ సిరీస్ లో కూడా చేసింది, ఇది ఇంకా స్ట్రీమింగ్ అవలేదు. ఇప్పుడు ఇంకొక హిందీ వెబ్ సిరీస్ 'రక్తబీజ్' కి శ్రీకారం చుట్టారు. ఆదిత్య రాయ్ కపూర్ కి జోడీగా ఇందులో నటిస్తోంది, ఆదిత్య రాయ్ ఇంతకు ముందు 'నైట్ మేనేజర్' అనే వెబ్ సిరీస్ లో అతను చేశాడు.

ఆసక్తికరం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లు అన్నిటికీ రాజ్ డీకేలు ఇద్దరూ దర్శకత్వం వహించటం. ఆ ఇద్దరు చేసిన వెబ్ సిరీస్ లో మాత్రమే సమంత నటిస్తూ ఉండటం. వాళ్లిద్దరూ సమంత కి ఒక మంచి పాత్ర క్రియేట్ చేస్తూ ఉండొచ్చు, దానికితోడు వాళ్ళు ఇద్దరూ కూడా తెలుగువాళ్లు అవటం విశేషం. వీళ్ళిద్దరూ ఇంతకు ముందు కొన్ని హిందీ సినిమాలు చేశారు, అలాగే వీళ్ళు దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ లు అన్నీ మంచి విజయం సాధించాయి.

తాజా సమాచారం ప్రకారం సమంత ఇప్పుడు కేవలం హిందీ సినిమా, హిందీ వెబ్ సిరీస్ లపైనే ఎక్కువ దృష్టి పెట్టింది అని అంటున్నారు. ఎందుకంటే ఎలాగు ఆ వెబ్ సిరీస్ లు అన్ని భాషల్లోకి తర్జుమా అవుతాయి, జాతీయ స్థాయిలో మంచి పేరు కూడా వస్తుంది. దక్షిణాదిలో లేదా తెలుగులో చేస్తే, ఇక్కడ వరకే పరిమితం అయిపోవాలి, అందుకని ఇకముందు హిందీలో చెయ్యడానికి నిర్ణయించుకుందని ఒక వార్త పరిశ్రమలో నడుస్తోంది. అదీ కాకుండా రాజ్ డీకేలు తరువాత హిందీ సినిమా చేసినా, అందులో సమంతకి ప్రధాన పాత్ర ఉంటుందని కూడా అంటున్నారు. అదీ కాకుండా షూటింగ్ సమంత ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు చెయ్యడానికి ఇష్టపడతారని, సమంత ఆరోగ్యం దృష్ట్యా అది చాలా అవసరమని, అందుకే వాళ్ళ దర్శకత్వంలో చెయ్యడానికి సమంత ఇష్టపడుతుందనీ ఇంకో వార్త నడుస్తోంది.

తన కెరీర్ దక్షిణాదిలో ప్రారంభించిన సమంత ఇటువైపు కూడా ఏదైనా చెయ్యాలని అనుకొని, అందుకు నిర్మాతగా మారిందని కూడా అంటున్నారు. ఇంతకు ముందు 'మా ఇంటి బంగారం' అని ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే, కానీ ఆ సినిమా గురించి ఎటువంటి సమాచారం మాత్రం మళ్ళీ ఇవ్వలేదు. అంటే ఇక దక్షిణాది కన్నా హిందీవైపే సమంత దృష్టి పెట్టొచ్చు అని కూడా పరిశ్రమలో వినిపిస్తోంది.

Updated Date - Jul 01 , 2024 | 05:22 PM