Actress Hema: బెయిల్ పై వచ్చాక తిరుపతిలో కనిపించిన హేమ, షాకింగ్ సమాధానం

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:05 PM

బెంగుళూరు రేవ్ పార్టీకి హాజరైన నటి హేమాను తరువాత బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల తరువాత బెయిల్ పై బయటకి వచ్చిన హేమ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. తరువాత పాత్రికేయులతో మాట్లాడుతూ ఆ కేసు గురించి ఏమన్నారంటే...

Actress Hema

బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తరువాత పోలీసులు ఆ పార్టీ జరుగుతున్న ఫార్మ్ హౌస్ కి ఆకస్మిక తనికీ చేసి చాలామందికి టెస్టులు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అందులో తెలుగు సినిమా నటి హేమ కూడా వున్నారు, ఆమెని కూడా టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అని వచ్చింది. తరువాత బెంగుళూరు పోలీసులు హేమని విచారణకు హాజరు కావాలని కోరగా, హేమ కొంచెం సమయం కావాలని చెప్పడం, ఆ తరువాత హేమని అరెస్టు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే.

కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన హేమ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. నిన్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన తరువాత బయట ఎదురుచూస్తున్న పాత్రికేయులతో మాట్లాడారు. అయితే పాత్రికేయులు అడిగిన ప్రశ్నకి హేమ షాకింగ్ సమాధానం చెప్పారు. హేమ గుడి నుండి బయటకి వచ్చిన తరువాత అక్కడ చాలామంది హేమతో ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. అందరికీ సెల్ఫీలు ఇచ్చిన హేమ తరువాత పాత్రికేయులతో మాట్లాడారు.

తిరుపతి తను చిన్నప్పటి నుండి వస్తున్నాను అని, అందుకని ఇది తనకి పుట్టిల్లు లాంటిదని చెప్పారు హేమ. "దర్శనం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా వుంది, చాలాసేపు గుడిలో కూర్చొని వస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇది నా పుట్టిల్లు అని మీ అందరికీ తెలుసు," అని చెప్పారు హేమ ఎదురుచూస్తున్న పాత్రికేయులతో. బెయిల్ పై బయటకి వచ్చారు కదా, ఆ కేసు గురించిన వివరాలు ఏమైనా చెప్తారా అని అడిగినప్పుడు, "మీకే తెలియాలి, మీరే రాస్తున్నారుగా న్యూస్", అంటూ సమాధానం చెప్పి హేమ వెళ్లిపోయారు.

Updated Date - Jun 29 , 2024 | 04:05 PM