Vidya Balan: మరోసారి ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి బయోపిక్‌ చర్చ

ABN, Publish Date - Sep 16 , 2024 | 04:05 PM

గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి (MS Subbalakshmi) గురించి పరిచయం అక్కర్లేదు. తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారామె.

గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి (MS Subbalakshmi) గురించి పరిచయం అక్కర్లేదు. తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారామె. సోమవారం ఆమె 108వ జయంతి. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ (Vidya Balan) ఆమెకు నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విద్యాబాలన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది(Photographic tribute to M S Subbulakshmi). దీంతో లెజెండరీ సింగర్‌ బయోపిక్‌ గురించి మరోసారి చర్చకు వచ్చింది. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అంటే తనకు ఎంతో ఇష్టమని విద్యాబాలన్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా మరోసారి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.  ఎంఎస్‌ సుబ్బులక్ష్మి లాగే మేకోవర్ అయ్యి కనిపించారు. ఆమె పాత్రలో నటించాలనే కోరికను బయటపెట్టారు. 

‘నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఉదయం నిద్ర లేవగానే వినిపించే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బులక్ష్మి గారి గొంతే వినిపిస్తుంది. ఆమెకు ఇలా నివాళులర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని విద్యాబాలన్‌ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు స్పందిస్తూ ఆమె బయోపిక్‌ గురించి అడుగుతున్నారు. దీంతో మరోసారి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ ఇండస్ర్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమె బయోపిక్‌లో విద్యాబాలన్‌ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేశ్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ‘మహానటి’ సినిమా తర్వాత ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌లోనూ కీర్తి కనిపించనుందన్న వార్తలే జోరుగా ప్రచారమయ్యాయి. అయితే ఈ విషయంలో ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated Date - Sep 16 , 2024 | 04:07 PM