Tripti Dimri: చెడు అలవాట్లకు బానిసవుతుందన్నారు

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:44 AM

నటిగా మారాలనుకున్నప్పుడు.. ఇంట్లో వాళ్లు ప్రోత్సహించినప్పటికీ చుట్టుపక్కల వాళ్లు, బంధువులు నోటికి వచ్చినట్లు మాట్లాడి, తల్లిదండ్రులను భయపెట్టారని తెలిపారు.

బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’తో ఒక్కసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది నటి త్రిప్తి డిమ్రి. వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌ బిగినింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నటిగా మారాలనుకున్నప్పుడు.. ఇంట్లో వాళ్లు ప్రోత్సహించినప్పటికీ చుట్టుపక్కల వాళ్లు, బంధువులు నోటికి వచ్చినట్లు మాట్లాడి, తల్లిదండ్రులను భయపెట్టారని తెలిపారు.

‘‘మాది ఉత్తరాఖండ్‌. తర్వాత కుటుంబం ఢిల్లీలో సెటిల్‌ అయింది. నేను పుట్టి, పెరిగిందంతా ఢిల్లీలోనే. చిన్నతనం నుంచి నాకు యాక్టింగ్‌పై ఆసక్తి ఉండేది. నటి కావాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు కాస్త కంగారుపడ్డారు. ధైర్యం చేసి ముంబయి వచ్చా. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం. ప్రతిరోజూ వర్క్‌ కోసం ప్రయత్నాలు చేసేదాన్ని. చేతిలో అవకాశాల్లేక బాధపడిన క్షణాలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకం కూడా కోల్పోయా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోవాలని నిర్ణయించుకున్నా. తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లకూడదనుకున్నా. చివరకు హీరోయిన్‌గా ‘లైలా మజ్ను’తో మంచి పేరు సొంతం చేసుకున్నా’’ అని త్రిప్తిడిమ్రి అన్నారు.

రిలేటివ్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ముంబయికి వచ్చిన సమయంలో బంధువులు, చుట్టుపక్కల వాళ్లు నా తల్లిదండ్రులకు ఇష్టం వచ్చిన విషయాలు చెప్పి కంగారు పెట్టారు. ‘‘మీ అమ్మాయిని ఎందుకు పంపించారు. సినీ ఫీల్డ్‌ మంచిది కాదు. మీ అమ్మాయి చెడు అలవాట్లకు బానిస అవుతుంది. పెళ్లి చేసుకోదు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు’’ అని చెడుగా చెప్పారు. మొదట నా కుటుంబ సభ్యులు భయపడ్డారు. కానీ, ‘లైలా మజ్ను’ విడుదలయ్యాక వారు ఎంతో ఆనందపడ్డారు. నా విషయంలో గర్వంగా ఉన్నట్లు చెప్పారు’’ అని ఆమె వివరించారు. సందీప్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ తర్వాత త్రిప్తి డిమ్రిని అభిమానులు ‘నేషనల్‌ క్రష్‌’ అనే ట్యాగ్‌తో పిలుస్తున్నారు.  

Updated Date - Sep 20 , 2024 | 11:44 AM