Emergency: సెన్సార్‌ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోండి.. ముంబై హైకోర్టు

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:34 PM

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సంబంధించి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency)చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తోంది

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సంబంధించి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency)చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. సెన్సార్‌ పరంగా ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ముంబై హైకోర్టు 9Mumbai HC) సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ తాజాగా ఆదేశించింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా చిక్కులు తొలగలేదని భావిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సి ఉంది. చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్‌ న్యాయస్థ్థానాన్ని సంప్రదించింది. 

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదళ్‌ పార్టీ కూడా సెన్సార్‌ బోర్డును కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాలను పెంపొందింపజేేసలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది. ఈ క్రమంలోనే కంగన, చిత్ర నిర్మాణసంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ముంబై హైకోర్టును సంప్రదించారు. సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలకు విరుద్థంగా తాము ఆదేశాలని ఇవ్వలేమని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా విచారణ అనంతరం వారం రోజుల్లోగా ఒక నిర్ణయానికి రావాలని సెన్సార్‌ బోర్డుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Sep 19 , 2024 | 04:41 PM