Bollywood: బాక్సాఫీస్ వద్ద క్రేజీ ప్రాజెక్ట్స్ క్లాష్!

ABN, Publish Date - Jan 05 , 2023 | 05:13 PM

సినిమాను రూపొందించడం ఎంత కష్టమో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం అంత కన్నా కష్టం. అందువల్ల నిర్మాతలు చిత్రాలను సెలవు దినాల్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

సినిమాను రూపొందించడం ఎంత కష్టమో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం అంత కన్నా కష్టం. అందువల్ల నిర్మాతలు చిత్రాలను సెలవు దినాల్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడయితే ప్రేక్షకులకు ఖాళీ ఉంటుందని.. సినిమా హాళ్లకు ఆడియన్స్ వస్తారని నిర్మాతలు ఆలోచిస్తారు. అందువల్ల హాలీడే వస్తుందంటే చాలు రెండు, మూడు మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతుంటాయి. ఏ ఇండస్ట్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. ఇండిపెండెన్స్ వీకెండ్‌లో బాలీవుడ్‌లో రెండు సినిమాలు క్లాష్ అవ్వబోతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి..

బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్ (Sunny Deol), అమిషా పటేల్ (Ameesha Patel) హీరో, హీరోయిన్స్‌గా నటించిన సినిమా ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ్’ (Gadar: Ek Prem Katha). సన్నీ ఈ చిత్రంలో తారాసింగ్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ 2001లో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రెండు దశాబ్దాల అనంతరం ఈ మూవీకి రెండో భాగం రూపొందుతుంది. ‘గదర్ 2’ (Gadar 2) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికీ అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వాత్రంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 11న విడుదల కానున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఎడిటింగ్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. మేకర్స్ త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్‌కు ‘యానిమల్’ (Animal)ను ప్రకటించారు. ‘యానిమల్‌’ లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్స్‌గా నటించారు. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘గదర్ 2’, ‘యానిమల్’ పై భారీ బజ్ ఉంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Updated Date - Jul 31 , 2024 | 08:28 AM