సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు
ABN, First Publish Date - 2022-05-05T21:34:27+05:30
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘జై భీమ్’. టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామాగా
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘జై భీమ్’. టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గతేడాది నవంబర్లో అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ మూవీ అభిమానుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సూర్య, జ్యోతిక కలసి తమ సొంత నిర్మాణసంస్థపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జై భీమ్’ చిత్రంలోని క్యాలెండర్ సీన్పై గతంలోనే వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
వన్నియార్ కమ్యూనిటీని కించపరిచేలా క్యాలెండర్ సీన్ ఉందని ఆ సంఘం నేతలు గతేడాది నవంబర్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సీన్ను తొలగించాలని కోరారు. ఆ పిటిషన్ను సైదాపేట కోర్టు విచారణ జరిపింది. హీరో సూర్య, అతడి భార్య జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించింది. కేసును దర్యాప్తు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది. సినిమా విడుదలైప్పుడే ఆ సీన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వన్నియార్ సంఘం సూర్య, టీజే. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్కు లీగల్ నోటీసులు పంపించింది. రూ. 5కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది.