సామాన్యుల త్యాగం... ఆలోచనలే ‘అన్ హర్డ్’
ABN, First Publish Date - 2021-09-15T06:34:15+05:30
‘‘స్వాతంత్రోద్యమంలో నాయకుల వెంట నడిచిన సామాన్యుల ఆలోచనలు ఎలా ఉండేవి? ఎలాంటి త్యాగాలు చేశారు? అనేవి చూపిస్తూ... సామాన్యుడి కోణంలో తీసిన సిరీస్ ‘అన్ హర్డ్’. అప్పుడు నాకు 18, 19 ఏళ్లు అనుకుంటా...
‘‘స్వాతంత్రోద్యమంలో నాయకుల వెంట నడిచిన సామాన్యుల ఆలోచనలు ఎలా ఉండేవి? ఎలాంటి త్యాగాలు చేశారు? అనేవి చూపిస్తూ... సామాన్యుడి కోణంలో తీసిన సిరీస్ ‘అన్ హర్డ్’. అప్పుడు నాకు 18, 19 ఏళ్లు అనుకుంటా... ఉస్మానియా యూనివర్సిటీలో ‘గాంధీ అండ్ మేనేజ్మెంట్’ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ సిరీస్ ఆలోచన వచ్చింది’’ అని ఆదిత్య కేవీ అన్నారు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న వెబ్ సిరీస్ ‘అన్ హర్డ్’. అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, బాలాదిత్య, అజయ్, చాందిని చౌదరి, ఆనంద చక్రపాణి ప్రధాన తారాగణం. రాధికా లావు నిర్మాత. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదిత్య కేవీ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్ ఇది. దీనికంటే ముందు ‘దైత్య డైరీస్’ పుస్తకం రాశా. అది మైథలాజికల్ ఫిక్షనల్. తర్వాత రాధికా లావుగారితో పని చేయడం ప్రారంభించా. ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సిరీస్ స్ర్కీన్ప్లే విభాగంలో పని చేశా. కరోనా కాలంలో ‘అన్ హర్డ్’ ఐడియా ఆమెకు చెప్పా. వెంటనే అంగీకరించారు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే! ఐ లవ్ మై సిటీ. అలాగే, హిస్టరీ అంటే ఇష్టం. ఓ దేశంగా ఇండియా ఏర్పడటానికి హైదరాబాద్ చాలా ముఖ్యం. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా... భాగ్య నగరం 1948లో దేశంలో విలీనమైంది. మన ఫ్రీడమ్ స్ట్రగుల్, తెలుగు వాళ్లు పడిన కష్టాల గురించి ఎక్కువ మాట్లాడం. మర్చిపోతుంటాం. బ్రిటీషర్లకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. దాన్ని నేను పూర్తిగా చూపించలేదు. కానీ, సృశిస్తూ ‘అన్ హర్డ్’ చెప్పాను. సిరీస్ అంతా మాటల మీద నడుస్తుంటుంది. కథ 1906లో మొదలై, 1950లో ముగుస్తుంది. స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియని సమయంలో భావి తరాల కోసం ప్రజలు పోరాడారు. చావడానికి సిద్ధపడ్డారు. స్వాతంత్రోద్యమంలో ఒక్కొక్కరి దృక్కోణం ఒక్కోలా ఉండొచ్చు. ఎవరి అభిప్రాయం వారిది. ఒకరు గాంధేయవాది కావచ్చు. మరొకరు భగత్ సింగ్ను అనుసరించవచ్చు. అయితే, వాళ్ల అంతిమ లక్ష్యం ఒక్కటే... స్వాతంత్య్ర సాధన. అభిప్రాయాలు చర్చకు వచ్చినప్పుడు చివర్లో ఒకరితో మరొకరు ఏకీభవించకూడదనే నిర్ణయానికి వచ్చేవారు. దాన్ని సిరీస్లో చూపించా. ఇందులో ప్రతి పాత్రా కల్పితమే. ఆ కాలంలో సగటు మధ్య తరగతి మనుషుల్ని ప్రతిబింబిస్తాయి. మా ముత్తాత నుంచి కూడా స్ఫూర్తి పొందాను. కథపై నాతో పాటు మా టీమ్ చాలా రీసెర్చ్ చేసింది. ఓటీటీలో నిడివి విషయంలో పరిమితి లేదు. అందుకని, వెబ్ సిరీస్ చేశా. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి’’ అని చెప్పారు.