చిరంజీవి ఇంట్లో చిత్ర ప్రముఖుల సమావేశం
ABN, First Publish Date - 2021-08-17T07:12:33+05:30
కరోనా కష్టకాలంలో తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైన, అలాగే ఏపీలో టిక్కెట్ రేట్ పెంపుదల విషయంపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన నేపథ్యంలో...
కరోనా కష్టకాలంలో తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైన, అలాగే ఏపీలో టిక్కెట్ రేట్ పెంపుదల విషయంపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాల్సిన అన్ని అంశాల గురించి ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయం ముఖ్యమంత్రి జగన్తో చర్చించాలనీ, చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షో అనుమతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనీ తీర్మానించారు. ఈ సమస్యలన్నిటినీ త్వరగా పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్ను ముఖ్యమంత్రి ముందు ఉంచాలని నిర్ణయించారు. అలాగే పరిశ్రమలో అన్ని విభాగాల్లో ఎదురవుతున్న సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 21 నుంచి 31లోగా చిరంజీవి బృందం ఏపీ సీఎంను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్బాబు, దిల్ రాజు, కె.ఎస్.రామారావు, దామోదర ప్రసాద్, సుప్రియ, సునీల్ నారంగ్, స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమినీ కిరణ్, భోగవల్లి బాబీ, విక్కీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.