బార్ అండ్ రెస్టారెంట్ కల్చర్ నేపథ్యంలో.. ‘వెబ్’
ABN , First Publish Date - 2022-01-28T04:11:22+05:30 IST
నలుగురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రంలో ‘కాళి’, ‘ఇస్పేట్ రాజావుం ఇదయ రాణియుం’ చిత్రాల్లో నటించిన శిల్పా మంజునాథ్ ప్రధాన హీరోయిన్గా, షాస్వి బాలా, సుప్రియ, విజే అనన్య మిగిలిన హీరోయిన్లుగా
వేలన్ ప్రొడక్షన్స్ బ్యానరులో వీఎం మునివేలన్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వెబ్’ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. నూతన దర్శకుడు హారుణ్ ఈ చిత్రానికి కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. నట్టి అలియాస్ నటరాజన్ సుబ్రమణియం హీరోగా నటించారు. నలుగురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రంలో ‘కాళి’, ‘ఇస్పేట్ రాజావుం ఇదయ రాణియుం’ చిత్రాల్లో నటించిన శిల్పా మంజునాథ్ ప్రధాన హీరోయిన్గా, షాస్వి బాలా, సుప్రియ, విజే అనన్య మిగిలిన హీరోయిన్లుగా వీరితో పాటు మొట్టై రాజేంద్రన్, మురళి, దీప్సికా, భారత నాయుడు, ప్రీతి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. కార్తీక్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మూడు పాటలు ఉండగా, శాండి మాస్టర్, హరీష్ కార్తీక్, శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
సాలెగూడులో చిక్కుకున్న కీటకాలు అక్కడ నుంచి బయటపడేందుకు చేసే పోరాటమే ఈ కథ. అందుకే దీనికి వెబ్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. చెన్నైలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిన తర్వాత ఈస్ట్కోస్ట్ రోడ్డులో కొత్తగా పుట్టుకొచ్చిన బార్ అండ్ రెస్టారెంట్ కల్చర్ను నేపథ్యంగా చేసుకుని దర్శకుడు ఈ కథను అద్భుతంగా రాశారని నిర్మాత మునివేలన్ వెల్లడించారు. పోస్ట్ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.