నన్ను, చరణ్‌ని గుర్తించండి... పెద్ద వివాదంలో ఉపాసన పోస్ట్‌

ABN , First Publish Date - 2022-01-27T23:14:14+05:30 IST

ఇప్పుడసలే చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతింటున్న రోజులైతే.. మెగా కోడలు ఉపాసన తెలిసి చేసిందో.. లేక తెలియక చేసిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఆమె చేసిన తాజా పోస్ట్‌పై పెద్ద వివాదమే చెలరేగుతోంది.

నన్ను, చరణ్‌ని గుర్తించండి... పెద్ద వివాదంలో ఉపాసన పోస్ట్‌

ఇప్పుడసలే చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతింటున్న రోజులైతే.. మెగా కోడలు ఉపాసన తెలిసి చేసిందో.. లేక తెలియక చేసిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఆమె చేసిన తాజా పోస్ట్‌పై పెద్ద వివాదమే చెలరేగుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ పోస్ట్ చేసింది. ఇది ఒక ఆర్ట్ వర్క్ అని, తనకి ఇది వాళ్ల అమ్మ పంపించిందని తెలుపుతూ.. గుడి గోపురంపై మనుషులు ఉన్న ఓ పిక్‌ని ఉపాసన షేర్ చేసింది. దీనిలో తను, రామ్ చరణ్ కూడా ఉన్నామని.. ఎక్కడ ఉన్నామో గుర్తించండి అంటూ ఓ ఫజిల్ కూడా విసిరింది. అయితే దేవుడి ప్రతిమలు ఉన్న చోట ఇలా చెప్పులు వేసుకుని ఉన్న మనుషులను పెట్టడం ఏమిటని.. హిందువులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతిస్తోన్న ఈ ఆర్ట్ వర్క్‌ని పోస్ట్ చేయడమే కాకుండా.. దీనికి కారణమైన వారిని అభినందించాలని ఉందంటూ, ఉపాసన చేసిన ఈ పోస్ట్‌పై.. కాస్త ఘాటుగానే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


మాములుగా అయితే ఉపాసన ఇలాంటి వివాదాల జోలికి వెళ్లదు. సోషల్ మీడియాలోనూ, అలాగే ప్రత్యక్షంగానూ సామాజిక సేవ చేస్తూ.. అందరి మన్ననలను అందుకుంటున్న ఉపాసన.. ఈ పోస్ట్ ద్వారా కూడా మంచినే ఆశించింది. ఈ పోస్ట్‌లో ‘‘ఎటువంటి సరిహద్దులు లేకుండా అందరం కలిసి.. అందరినీ కలుపుకుంటూ.. మరింత సహనంతో.. దేశ అభివృద్ధిలో భాగమవుదాం.,’’ అంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన. కానీ ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే ఇప్పుడామెను వివాదంలోకి నెట్టివేసింది. అయితే నెటిజన్లు ఎంతగా ఫైర్ అవుతున్నా.. ఇప్పటి వరకు ఆమె ఈ పోస్ట్‌ని తొలగించకపోవడం గమనార్హం.



Updated Date - 2022-01-27T23:14:14+05:30 IST