ఉక్రెయిన్లో షూటింగ్లకు దారేది?
ABN , First Publish Date - 2022-02-27T22:57:23+05:30 IST
ఉక్రెయిన్సై రష్యా భీకర యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే! రష్యా చర్యలతో ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఈ పరిణామాలపై ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అమాయక పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. బాంబుల దాడికి ఉక్రెయిన్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు సినిమా షూటింగ్ లొకేషన్లు నాశనం అవుతున్నాయి.
ఉక్రెయిన్సై రష్యా భీకర యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే! రష్యా చర్యలతో ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఈ పరిణామాలపై ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అమాయక పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. బాంబుల దాడికి ఉక్రెయిన్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు సినిమా షూటింగ్ లొకేషన్లు నాశనం అవుతున్నాయి. గతంలో ఇక్కడ చాలా చిత్రాలు షూటింగ్ చేసుకొచ్చాయి. ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఉక్రెయిన్లో షెడ్యూల్స్ వేసుకున్నాయి. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో చక్కబడేలా లేదు. షెడ్యూల్ వేసుకున్న చిత్రాల పరిస్థితి ఏంటా అని మేకర్స్ గబరా పడుతున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12 నుంచి రష్యాలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే అది యుద్ద ప్రాంతానికి చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం అక్కడున్న పరిస్థిల మీదున్న అవగాహనతో లీగల్గా షూటింగ్ చేస్తున్నారీ చిత్ర బృందం.
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్లో చిత్రీకరించారు. గత ఆగస్టులో చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ రచనా సహకారం అందించి, నిర్మించిన ‘99 సాంగ్స్’. ఈ సినిమాలోని అత్యధిక సన్నివేశాలను అక్కడే తెరకెక్కించారు.సాయితేజ్ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘విన్నర్’ సినిమా సాంగ్స్ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. కీవ్, లీవూ ప్రాంతాల్లో కొన్ని షాట్స్ తీశారు. మూడు పాటలను ఇక్కడ తెరకెక్కించినట్లు గోపీచంద్ మలినేని తెలిపారు. రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.ఓ’. చిత్రంలో ఓ పాట కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. పాటతోపాటు కొన్ని సన్నివేశాలను కూడా అక్కడ చిత్రీకరించారు. కార్తి నటించిన ‘దేవ్’ చిత్రంలోని సన్నివేశాలను ఉక్రెయిన్లో తీశారు.
అయితే ప్రస్తుతం యుద్దం జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా షూటింగ్ చేసుకుంటున్నా వారు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ బార్డర్లో ఎలాంటి చిత్రీకరణలు జరగడం లేదు. ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఆయా చిత్ర యూనిట్లు కొత్త లొకేషన్ వేటలో ఉన్నారు. తాజాగా సల్మాన్ఖాన్ కట్రీనా కైఫ్ జంటగా నటిస్తున్న ‘టైగర్ 3’, అజయ్ దేవగణ్ ‘రన్వే 34’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఇటీవల అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చాయి.
అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా నటిస్తున్న ‘లేడీ కిల్లర్’ చిత్రంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎంక్వైరి చేశారట. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడి షూటింగ్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది’’ అని సినిమా లైన్ ప్రొడ్యూసర్ సర్పరాజ్ తెలిపారు. టైగర్ ష్రాఫ్, కృతీసనన్ నటిస్తున్న ‘గణపత్’ చిత్రం కూడా ఉక్రెయిన్లో చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేశారు. రెక్కీ కూడా పూర్తి చేసి మార్చి నెలాఖరులో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అప్పటికి పరిస్థితులు సర్దుమణిగితే ఈ చిత్రం అంతగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ప్రస్తుతం మార్చి మొదటివారంలో ముంబైలో ఓ షెడ్యూల్ ప్రారంభించే పనుల్లో ఉన్నారు. ‘రన్ వే 34’ చిత్రాన్ని రష్యా ఎయిర్పోర్ట్లో చిత్రీకరించారు.