కథ మలుపుతిప్పే పాత్ర ఇది
ABN , First Publish Date - 2021-11-12T10:46:22+05:30 IST
నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే నా ప్రాధాన్యం అంటున్నారు వర్ధమాన కథానాయిక గీత్సైని. ఆనంద్ దేవరకొండకు జోడీగా ఆమె నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. నేడు థియేటర్లలో విడుదలవుతున్న...
నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే నా ప్రాధాన్యం అంటున్నారు వర్ధమాన కథానాయిక గీత్సైని. ఆనంద్ దేవరకొండకు జోడీగా ఆమె నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. నేడు థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘పుష్పక విమానం’ చిత్రంలో మీనాక్షి అనే కొత్త పెళ్లి కూతురి పాత్ర నాది. ఆనంద్ దేవరకొండకు భార్యగా నటించాను. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను వదిలి వేరే వ్యక్తితో వెళ్లిపోతుంది. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ ఛాయలున్న పాత్రలు పోషించడం మంచిది కాదని దర్శకుడు దామోదర్ చెప్పారు. కానీ నటనకు ఆస్కారమున్న, కథను మలుపు తిప్పే పాత్ర కావడంతో మరో ఆలోచన లేకుండా అంగీకరించాను. భవిష్యత్లోనూ నటిగా మంచి పేరు తెచ్చే పాత్రలకే నా ప్రాధాన్యం. సినిమా వాతావరణం నాకు పూర్తిగా కొత్త. సెట్లో ఎలా మెలగాలో ఆనంద్ దేవ రకొండ సలహాలిచ్చారు. కొవిడ్ వల్ల షూటింగ్కి గ్యాప్ రావడంతో నా పాత్ర తాలూకు భావోద్వేగాలను ఒకే మోతాదులో పలికించడం కొంచెం కష్టంగా అనిపించింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది సినిమా’’ అని అన్నారు.