ఈ వారం థియేటర్‌– ఓటీటీ చిత్రాలివే!

ABN , First Publish Date - 2021-11-22T23:38:05+05:30 IST

గత వారం పది చిన్న చిత్రాలు థియేటర్‌, ఓటీటీ వేదికగా సందడి చేశాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమయ్యాయి. ఇప్పటికే థియేటర్‌లో విడుదలైన పలు చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. ఆ సినిమాల సంగతులివి...

ఈ వారం థియేటర్‌– ఓటీటీ చిత్రాలివే!


గత వారం పది చిన్న చిత్రాలు థియేటర్‌, ఓటీటీ వేదికగా సందడి చేశాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమయ్యాయి. ఇప్పటికే థియేటర్‌లో విడుదలైన పలు చిత్రాలు ఓటీటీ  ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. ఆ సినిమాల సంగతులివి...


థియేటర్‌ చిత్రాలు...

శింబు పొలిటికల్‌ థ్రిల్ల్లర్‌...

'మన్మధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ హీరో శింబు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలేవి తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆయన నటించిన ది లూప్‌’ చిత్రంతో అలరించేందుకు రెడీ అయ్యారు. వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ‘మానాడు’ సినిమాను తెలుగులో ‘ది లూప్‌’ పేరుతో నవంబరు 25న థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్ల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయిక. 


యూత్‌ఫుల్‌ రాజా..

పక్కింటి అబ్బాయిగా అలరించే రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. 


కామెడీ.. ‘క్యాలీప్లవర్‌’...

సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా ఆర్కే మలినేని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘క్యాలీప్లవర్‌’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రానికి నిర్మాత. 


‘1997’లో ఏం జరిగింది? 

డా.మోహన్‌, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘1997’. వాస్తవ సంఘటనల ఆధారంగా డా.మోహన్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 


వాస్తవ ఘటనల ఆధారంగా...

హైదరాబాద్‌ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆశ ఎన్‌కౌంటర్‌’. ఆనంద్‌ చంద్ర తెరకెక్కించారు. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకిరానుంది.




వీటితోపాటు బాలీవుడ్‌ చిత్రాలు కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. జాన్‌ అబ్రహం ‘సత్యమేవ జయతే 2’ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 26న థియేటర్‌లో విడుదల కానుంది. 

ఓటీటీ చిత్రాలివే...

వెంకటేశ్‌ హీరోగా ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘దృశ్యం–2’ ఓటీటీ బాట పట్టింది. నవంబర్‌ 25న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది. మలయాళంలో ‘దృశ్యం–2’ తెరకెక్కించిన జీతూ జోసఫ్‌ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అన్నా, చెల్లెళ్ల అనుబంధం ఇతివృత్తంగా రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘పెద్దన్న’ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నెల 26 నుంచి సన్‌నెక్ట్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ర్టీమింగ్‌ అయ్యేందుకు సిద్థమైంది.  సాయిధరమ్‌ తేజ్‌ రిపబ్లిక్‌’, ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ చిత్రాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. 

అమెజాన్‌ ప్రైమ్‌

కొట్టిగొబ్బ3(కన్నడ) – నవంబరు 23

చోరీ(హిందీ) – నవంబరు 26


డిస్నీ హాట్‌స్టార్‌

2024(హిందీ) –  నవంబరు 23

హాకేయ్‌ – నవంబరు 24

దిల్‌ బెకరార్‌ – నవంబరు 26


నెట్‌ఫ్లిక్స్‌

ట్రూ స్టోరి – నవంబరు 24

బ్రూయిజ్‌డ్‌ – నవంబరు 24

ఏ కాజిల్‌ ఫర్‌ క్రిస్మస్‌ – నవంబరు 26









Updated Date - 2021-11-22T23:38:05+05:30 IST