అందుకే ఆ పాట తీసేశాం!
ABN , First Publish Date - 2022-06-29T05:45:21+05:30 IST
‘సమ్మతమే’తో తొలిసారి మెగాఫోన్ పట్టారు గోపీనాథ్ రెడ్డి. కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన చిత్రమిది...
‘సమ్మతమే’తో తొలిసారి మెగాఫోన్ పట్టారు గోపీనాథ్ రెడ్డి. కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన చిత్రమిది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల గోపీనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘చిరు జల్లుల మధ్య బైక్ రైడ్ లాంటి సినిమా తీయాలని.. ‘సమ్మతమే’ కథ రాసుకొన్నాను. చాలా మంచి స్పందన వస్తోంది. ఈ కథకు ఎక్కువగా యువతరం కనెక్ట్ అవుతుందనుకొన్నాను. కానీ.. పెద్దవాళ్లకూ నచ్చింది. ‘రాజావారు రాణీగారు’ అయిన వెంటనే కిరణ్తో ఈ సినిమా చేయాలి. కానీ కాస్త లేటయింది. ఈలోగా.. కిరణ్ ఇమేజ్ మారింది కదా అని ఈ సినిమాలో ఓ పాటని చివర్లో ఇరికించాం. సినిమా మొత్తం చూసుకుంటున్నప్పుడు ఆ పాటే అడ్డు తగులుతున్నట్టు అనిపించింది. అందుకే ఆ పాటని కత్తిరించాం. కథకు ఏం కావాలో అది నిజాయతీగా ఇస్తే సరిపోతుంది’’ అన్నారు.