సినిమాలపై విమర్శలొద్దు: బీజేపీ లీడర్
ABN , First Publish Date - 2021-11-30T00:26:04+05:30 IST
సినిమాల కోసం విమర్శలు చేయవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సినిమాల్లో పలు సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని పలు రాజకీయపార్టీల నేతలు విమర్శించడంతో..
సినిమాల కోసం విమర్శలు చేయవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సినిమాల్లో పలు సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని పలు రాజకీయపార్టీల నేతలు విమర్శించడంతో పాటు ఆ సినిమాలు ప్రదర్శించరాదని ఆందోళనలు కూడా చేపడుతున్నారు. ఇటీవల సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో, తాజాగా శింబు నటించిన ‘మానాడు’ చిత్రం కుల మతాల మధ్య చిచ్చుపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేదిగా ఉందంటూ బీజేపీ నిర్వాహకుడు ఒకరు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అన్నామలై, సినీరంగాన్ని పార్టీ నిర్వాహకులు విమర్శించరాదని, పార్టీ అధిష్ఠానానికి తెలియకుండా వేదికలపైన, సోషల్ మీడియాలో సినిమాల గురించి విమర్శించొద్దని సూచించారు.