ప్రేమ గీతంతో వచ్చిన Swathi Muthyam
ABN , First Publish Date - 2022-06-27T23:16:55+05:30 IST
బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్న ఈ చిత్రంతో
బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్. కె. కృష్ణ (Lakshman K Krishna) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు... ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం’ చిత్రంలోని ప్రేమ గీతం కూడా ప్రేమజంటల్ని ఆకర్షించేదిగా ఉంది.
నాయిక వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)తో ‘‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా.. నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా’’ అంటూ హీరో గణేష్ పాడుకుంటున్న ఈ పాటకు కె కె సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్, సంజన కాలమంజే ఆలపించారు. మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటని పట్టణం నేపథ్యంలో గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో తెరకెక్కించారు. విడుదలైన కొన్ని క్షణాలలోనే సోషల్ మీడియాలో ఈ పాటపై ప్రశంసల వర్షం కురుస్తుండటంతో దర్శకుడు లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ పాటకు సాహిత్యం అందించిన కె.కె. మాట్లాడుతూ.. ‘‘ప్రతి పాటకు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమయింది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుని బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉంది. అలాగే ఈ పాటలో
‘‘ఓ.. తారల్ని మూట కడతా
నీ కాలి ముందు పెడతా
అరె.. చందమామకి నీకూ తేడా లేదుగా
మబ్బుల్ని తెచ్చి కుడతా
రెక్కల్ని చేసి పెడతా
మేఘాలు దాటి పదా
ఆ ఆకాశం అంచుకే చేరదాం’’ అనే పదాలు, పాట పల్లవి నాకెంతో ఇష్టం’’ అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ఘనంగా విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు.