త్వరలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై బయోపిక్.. ఆయన సోదరి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-01-13T15:43:08+05:30 IST

‘ఎమ్‌ఎస్ ధోని’ సినిమాతో బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్...

త్వరలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై బయోపిక్.. ఆయన సోదరి ఏమన్నారంటే..

‘ఎమ్‌ఎస్ ధోని’ సినిమాతో బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అలాంటి యాక్టర్ అనుకోకుండా మృతి ఆయన అభిమానులనే కాకుండా సినీ లవర్స్ అందరినీ కలవరపరిచింది. అందుకే ఆయన చనిపోయి సంవత్సరన్నర దాటిపోయిన ఏదో సమయంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఆయన ఫ్యాన్స్.


అయితే జనవరి 21న ఆయన జయంతి జరగనుంది. ఈ తరుణంలో  ఆయన బయోపిక్ రానున్నట్లు వార్త హల్‌చల్ చేస్తోంది. అది ఆయన ఫ్యాన్స్ అందరిని ఎంతో సంతోషంలో ముంచెత్తింది. కాగా, తాజాగా ఈ విషయంపై సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో స్పందించింది.


ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో.. ‘సుశాంత్ విషయంలో న్యాయం జరిగే వరకు అతని జీవితంపై సినిమా చేయకూడదని నేను గట్టిగా అనుకుంటున్నాను. అది నేను నా సోదరుడు, కళాకారుడు, మేధావి సుశాంత్‌కి ఇచ్చే వాగ్దానం. 


రెండోది ఏంటంటే.. అతనిలాంటి అందమైన, అమాయక, డైనమిక్ వ్యక్తిత్వాన్ని తెరపై ప్రదర్శించే సామర్థ్యం ఎవరికి ఉంది. ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. 


మూడోది, ఎన్నో ఇబ్బందులకి గురి చేసే చలనచిత్ర పరిశ్రమలో వాటిని ఎదుర్కొంటూ.. ఎప్పుడూ హృదయాన్ని అనుసరించే సుశాంత్ కథని ప్రత్యేకంగా చిత్రీకరించే ధైర్యం, సమగ్రతను ఎవరికైనా ఉందని భావించడం భ్రమే అవుతుంది. కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల  అత్యంత ఆధిపత్య ధోరణి మధ్య సొంతంగా కష్టపడి ఓ స్థాయికి చేరుకున్నాడ‌’ని రాసుకొచ్చింది.


అంతేకాకుండా.. ‘చివరగా, నా సోదరుడు తన బయోపిక్‌ని ఏఐ టెక్నాలజీ సహాయంతో తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇది సమీప భవిష్యత్తులో నిజంగా మాత్రం కాకపోవచ్చ’ని తెలిపింది. ఆ పోస్ట్‌ని మీరు ఓసారి చూసేయండి..



Updated Date - 2022-01-13T15:43:08+05:30 IST