Suresh babu: ఆంధ్రాలో థియేటర్ల పరిస్థితి దారుణం!
ABN , First Publish Date - 2021-07-18T23:42:36+05:30 IST
ఇప్పుడున్న పరిస్థితిల్లో తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందని డి.సురేశ్బాబు పేర్కొన్నారు. ఆంధ్రాలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ రేట్లకు సినిమా హాళ్లు నడపడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితిల్లో తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందని డి.సురేశ్బాబు పేర్కొన్నారు. ఆంధ్రాలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ రేట్లకు సినిమా హాళ్లు నడపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఆయన సోదరుడు వెంకకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’ విడుదల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘‘టికెట్ ధరల్లో చిన్న సవరణలు అడిగినా ఏపీ ప్రభుత్వం చేయడం లేదు. సింగిల్ స్ర్కీన్ థియేటర్స్ యాజమాన్యాలు సినిమా మీద ప్రేమతో నడపడమే తప్ప పైసా లాభం ఉండదు. రూ. 40 టిక్కెట్తో ఏసీ థియేటర్లు నడపమంటే హౌస్ఫుల్ అయినా కూడా కరెంట్ బిల్లు రాదు. ప్రభుత్వాన్ని అడిగితే మీరు థియేటర్లు తెరవండి తర్వాత మారుస్తాం అంటున్నారట. అక్కడి థియేటర్ యాజమాన్యాలకు ఇది జీవన్మరణ సమస్యే’’ అని అన్నారు.
ఓటీటీని ఆపలేం..
సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలే ఓటీటీ బాట పడుతున్నారు. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్లతోపాటు ఓటీటీలోనూ చిత్రాలను విడుదల చేస్తోంది. పరిస్థితులను బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని ఆ సంస్థ గ్రహించింది. కొవిడ్ రాకపోయి ఉంటే ఓటీటీ ఇంత పాపులర్ అయ్యేది కాదు. కానీ కరోనా పరిస్థితుల్లో ఓటీటీ సినిమా ఇండస్ట్రీని కాపాడింది. కాబట్టి ఓటీటీని ఆపడం అనేది భ్రమే. వెబ్సిరీస్ల సంఖ్య పెరగడం వల్ల సినీ కార్మికులకు పలు విభాగాల్లో ఉపాధి లభిస్తోంది. నిర్మాతలకు లాభం లేకుండా లేదు. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది ఎగ్జిబిటర్లే. కరోనా వల్ల గడిచిన 15 నెలల్లో 12 నెలలు థియేటర్లు మూసి ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఆస్తి పన్ను, మినిమం పవర్ చార్జీల్లో కూడా రాయితీ ఇవ్వడం లేదు. 15 నెలలుగా వాడని విద్యుత్కు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఓటీటీ వల్ల థియేటర్ వ్యవస్థలో కాస్త మార్పు వస్తుందేమో కానీ కనుమరుగయ్యే అవకాశం లేదు.