Suman ghosh: ‘ఫ్రస్ట్రేషన్ వస్తోంది’!
ABN , First Publish Date - 2021-07-26T02:19:23+05:30 IST
బెంగాలీ దర్శకుడు సుమన్ ఘోష్ తెరకెక్కించిన ‘ఆధార్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇంకా విడుదల నోచుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
బెంగాలీ దర్శకుడు సుమన్ ఘోష్ తెరకెక్కించిన ‘ఆధార్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇంకా విడుదల నోచుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే ఆధార్ కార్డులు జారీచేసే ‘ద యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల ఆగిపోయింది. సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై సుమన్ ఘోష్ తాజాగా స్పందించారు. ‘‘ప్రభుత్వ సంస్థల్లో పని చేసే చాలామంది అధికారులు సినిమా చూశారనీ, 28 కట్స్ విధించారని నిర్మాణసంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్ నాకు ఫోనులో తెలిపింది. ఆ కట్స్ ఏమిటన్నది బయటకు చెప్పలేదు. ఆరు నెలలుగా అధికారులను, ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ఫోనులు చేశా. ఈ–మెయిల్స్ పంపించా. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే... సినిమాను నిలిపేయడం కంటూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ పరిస్థితి చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ వస్తోంది’’ అని చెప్పారు.