ఆమెతో ఒక్క పాటైనా పాడించలేదు!

ABN , First Publish Date - 2020-02-03T00:54:49+05:30 IST

భారతదేశ చలనచిత్ర సంగీతదర్శకుల్లో గొప్పవారెందరో ఉన్నారు. వారిలో దార్శనికులు, కొత్త ఒరవడి సృష్టి‌కర్తలు కొందరే. ఓ.పి. నయ్యర్ ఒక ట్రెండ్

ఆమెతో ఒక్క పాటైనా పాడించలేదు!

ఓ.పి.‌ నయ్యర్ లేదా ఓంకార్ ప్రసాద్ నయ్యర్. భారతదేశంలోని ఉన్నతమైన చలనచిత్ర దర్శకుల్లో ఒకరు వీరు. 1926- 2007ల కాలానికి చెందిన‌ వీరి వర్ధంతి ఇవాళ(జనవరి 28). వారిని ఒకసారి గుర్తుచేసుకుందాం రండి -

 

భారతదేశ చలనచిత్ర సంగీతదర్శకుల్లో గొప్పవారెందరో ఉన్నారు. వారిలో దార్శనికులు, కొత్త ఒరవడి సృష్టి‌కర్తలు (trend setters) కొందరే. ఓ.పి. నయ్యర్ ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్ని పాటల మధ్యలోనైనా ఇది ఓ.పి. నయ్యర్ పాట అని తెలిసిపోతూ ఉంటుంది. విలక్షణమైన‌ పాటల‌ సృష్టికర్త వారు. ఒక ప్రత్యేకతతో‌‌ వారి సంగీతం ఉంటుంది. భారతదేశ సినిమా పాటల సంగీతాన్ని ఓ.పి. నయ్యర్ సంగీతం పెద్ద ఎత్తున కదిలించింది. ఇతర భాషల్లోని‌ గొప్ప సంగీత దర్శకులు కూడా ఓ.పి. నయ్యర్ ప్రభావంతో పాటలు చేశారు.

 

లాహోర్ లో పుట్టిన ఓ.పి.‌ నయ్యర్ అక్కడే ఒక సంగీత కళాశాల్లో పియానో ఉపాధ్యాయులుగా‌ పని చేశారు. 1951లో‌ హిందీ సినిమాల్లోకి వచ్చారు. 1952లో తొలి సినిమా ఆస్మాన్ చేశారు. ఆ‌‌ సినిమా‌ పరాజయం పొందింది. ఒక దశలో‌ నయ్యర్‌‌ సినిమాల్ని‌ వదిలివెళ్లిపోదామనుకున్నారు. 1954లో వచ్చిన గురుదత్ సినిమా‌ ఆర్‌పార్ ఓ.పి.నయ్యర్ కు తొలి హిట్‌ సినిమా. 1956లో‌ వచ్చిన సి.ఐ.డి. సినిమాతో‌ ఓ.పి.నయర్ సంగీతం దేశాన్ని ఒక‌ ఊపు‌ ఊపేసింది. ఆ సినిమాలోని "ఒలెకే పెహలా పెహలా ప్యార్". పాట ఒక‌ సంచలనాన్ని సృష్టించింది.‌ ఆ పాట "ఓహో‌ బస్తీ‌‌ దొరసానీ..." అంటూ‌ తెలుగులోనూ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. సి.ఐ.డి సినిమాతో నయ్యర్ ఒక‌ నక్షత్ర సంగీత దర్శకులైపోయారు.‌ రిత్మ్ (rhythm) కింగ్ గా పేరు‌ పొందారు. ఓ.పి. నయ్యర్ అన్న‌ ముద్ర సినిమా సంగీతంలో‌ ఏర్పడింది.

 

ఎన్నో విలువైన పాటల్ని చేశారు ఓ.పి. నయ్యర్.‌ "బాబూజీ‌ ధీరే చల్నా..." ‌గీతా రాయ్ ఆర్‌పార్ సినిమాలో పాడిన ఈ పాటతో ఓ.పి.‌నయ్యర్ ముద్ర‌ భారతదేశ‌ సినిమాల్లో‌ నమోదయింది. ఒక కొత్త ఒరవడి అది ఆది. ఆదే సినిమాలో‌ షంషాద్ బేగం పాడిన "కభి‌‌ఆర్ కభి ప్యార్" మఱో‌‌ విలక్షణమైన పాట.‌ ఏక్ ముసాఫిర్ ఏక్‌హసీనా(1962) లో ఓ..పి. నయ్యర్ చేసిన "మే ప్యార్ క రాహీ హు..." ఒక‌ ప్రత్యేకమైన పాట. స్వతహాగా పియానో వాద్యకారులు కావడంతో ఓ.పి.నయ్యర్ పాశ్చాత్య పోహళింపుతో పాటలు చేశారు. బహారే ఫిర్ భి ఆయేంగీ(1968) సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన "ఆప్ కే హసీన్ రుఖ్ ... " పాట నయ్యర్ చేసిన గొప్ప పాటల్లోనే గొప్ప పాట. మనదేశంలో వచ్చిన గొప్ప పియానో పాటల్లో ఒకటి‌ అది. కాశ్మీర్ కీ కలీ(1964) సినిమాలో‌ రఫీ పాడిన "హాయ్‌ దునియా ఉసికీ జమానా..." పాట నయ్యర్ శాస్త్రీయ సంగీత ఛాయతో మహోన్నతమైన పాట చేశారు. ఆ కాశ్మీర్ కి కలీ సినిమాలో "ఇషారో ఇషారో .." పాట నయ్యర్ ఒక గొప్ప సంగీత దర్శకులన్న అవగాహననిస్తుంది. చివరి దశలో 1972లో ఇక్ బార్ ముస్క్‌రా దో సినిమాలో కిషోర్ కుమార్ పాడిన "ఇక్ బార్ ముస్క్ రా‌ దో" ‌అన్న‌ outlandish పాట చేశారు నయ్యర్. అంతవఱకూ చేసిన సంగీతానికి‌ భిన్నంగా వేఱే flavour తో చేశారు ఈ పాటను.

 

గాయని‌ ఆశాభోస్లే పరిణతి పొందిన‌‌ గొప్పగాయనిగా పరిణమించింది ఓ.పి.నయ్యర్ సంగీతం‌లోనే. సజ్జాద్ హుస్సేన్ 1952లోనే సంగ్‌దిల్ సినిమాలో "దర్దూ‌‌ భరీ కిసి..." అని పాడించి ఆశా‌‌ ఒక‌ మంచి గాయని అని‌ లోకానికి తెలియపఱిచినా "జరా సీ బాత్ కా" అంటూ‌ ముసాఫిర్ ఖనా (1955) సినిమాలో ఓ.పి. నయ్యర్ సంగీతంలో పలికిన ఆశాగానం అటుతరువాత ఎంతో రాణించింది. ఎన్నో పాటలుగా రాజిల్లింది.‌‌ సంగీతంపరంగా నయ్యర్ ఆశా కోసం అద్భుతాల్ని‌ సృష్టించారు. మేరాసనం (1965)‌ సినిమాలో నయ్యర్ ఆశాతో "జాయియే ఆప్ కహా జాయేంగే" అన్న అద్భుతాన్ని పాడించారు. నయ్యర్‌ అలా ఓ‌ పాటను ఎలా చెయ్యగలిగారో? నయ్యర్ ఒక ఉన్నతమైన సంగీత దర్శకులనడానికి ఆ పాటొక్కటే‌ చాలు.

 

లతా మంగేశ్కర్‌తో ఒక్క పాట కూడా నయ్యర్ పాడించలేదు. లతాతో‌ పాడించకుండా రాణింవగలిగిన‌ ఒకే‌ సంగీత దర్శకులు నయ్యర్‌ మాత్రమే. నయ్యర్ మూడేళ్ల పాటు రఫీతో‌ కూడా పాడించలేదు. ఆ తరువాత రఫీతో‌ పాడించనందుకు బాధపడ్డారు. రఫీ‌తో‌ పాడించని కాలంలో మహేంద్రకపూర్ తో పాడించారు. అందువల్ల‌ నయ్యర్ సంగీత‌ం నాణ్యత తగ్గిన మాట‌‌ వాస్తవం.‌ ఈ‌ వ్యాస రచయితతో‌‌ ఒక‌ సందర్భంలో‌‌ తాను‌ నయ్యర్ కు ఋణపడి ఉన్నానని‌ మహేంద్రకపూర్ చెప్పారు.

 

దక్షిణభారతదేశంలోనూ, తెలుగులోనూ వచ్చిన కొన్ని పాటలపై ఓ.పి.నయ్యర్ ప్రభావం ఉంది. తెలుగులో సత్యం నయ్యర్ ప్రభావంతో పాటలు చేశారు. సత్యం చేసిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" ‌నయ్యర్ ప్రభావంతో చేసిన పాటే. ఎంతో గొప్ప సంగీతదర్శకులైన‌ ఎం.ఎస్. విశ్వనాథన్ నయ్యర్‌ ప్రభావంతో పాటలు చేశారు. అందమాన్ కాదలి‌ సినిమాలో విశ్వనాథన్ "అందమానై‌ పారుంగళ్‌ అళగు" ‌అన్న పాటను‌ పూర్తిగా నయ్యర్‌ ప్రభావంతో‌ చేశారు. సిఱై‌ అన్న సినిమాలో‌ "జాయియే ఆప్ కహా జాయేంగే" పాట పల్లవిని దాదాపుగా అలాగే తీసుకుని "ఎనక్కు నీయుం ఉనక్కు‌ నానుం" అన్న పాటను‌ పి. సుశీల చేత పాడించారు విశ్వనాథన్. ఇళయరాజా పగలిల్ ఒరు ఇఱవు సినిమాలో చేసిన‌ అద్భుతమైన పాట ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన‌ "ఇళమై ఎనుం పూంగార్ట్రు పాడియదు‌ ఓర్ పాట్టు" పాటకు నయ్యర్ "జాయియే ఆప్ కహా జాయేంగే" పాట స్ఫూర్తినిచ్చిందేమో‌‌ అని అనిపిస్తుంది. మణిశర్మ‌‌‌ వంటి సంగీత దర్శకులు‌ నయ్యర్ ప్రభావంతో పాటలు‌ చేశారు.

 

ఓ.పి.నయ్యర్ 1988లో నీరాజనం‌‌ తెలుగు‌‌ సినిమాకు సంగీతం చేశారు. దీనికి ఉత్తమ‌సంగీత దర్శకులుగా‌‌ నంది పురస్కారాన్ని అందుకున్నారు‌. మొహమ్మద్ రఫీ తరువాత భారతదేశంలోనే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకులని ఓ.పి. నయ్యర్ తేల్చి చెప్పడం విశేషం. మనం‌‌ సంతోషించాల్సిన విషయం.

భారతదేశ సినిమా సంగీతంపై‌ ఒక చెఱగని ముద్ర ఓంకార్ ప్రసాద్ నయ్యర్ లేదా‌ ఓ.పి. నయ్యర్.

 

-రోచిష్మాన్

9444012279

rochishmon@gmail.com

Updated Date - 2020-02-03T00:54:49+05:30 IST