సహజత్వంతో మెరిసే.. స్వాతిముత్యం
ABN , First Publish Date - 2022-10-04T07:30:47+05:30 IST
‘‘నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే ఇష్టం. ‘స్వాతిముత్యం’ కథలో అది కనిపించింది. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా’’ అన్నారు...
‘‘నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే ఇష్టం. ‘స్వాతిముత్యం’ కథలో అది కనిపించింది. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా’’ అన్నారు వర్ష బొల్లమ్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేశ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం బుధవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వర్ష మాట్లాడుతూ ‘‘ఇందులో ఓ టీచర్గా నటించా. టీచర్ అంటే కాస్త కఠినంగా ఉండాలి కదా..? నా పాత్ర అలానే ఉంటుంది. కథానాయకుడు గణేశ్కి ఇది తొలి సినిమా. తనతో పోలిస్తే నేను సీనియర్. సెట్లో తనకు కొన్ని సలహాలు చెప్పాలేమో అనుకొన్నా. కానీ గణేశ్ ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. తనకు సినిమా పట్ల ఇదివరకే పరిజ్ఞానం ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలో పనిచేయాలని అందరికీ ఉంటుంది. చాలా పెద్ద పేరున్న సంస్థ. పారితోషికాలు సకాలంలో ఇస్తారు. మంచి కథల్ని ఎంచుకొంటారు. అంతకంటే ఏం కావాలి? ఈ చిత్రంలో ఓ విభిన్నమైన పాయింట్ స్పృశించాం. ఆ అంశం అందరికీ నచ్చుతుంది. ఈ దసరా పండక్కి కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామ’’న్నారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘‘నాకిప్పటి వరకూ వచ్చిన పాత్రల్లో మంచివాటినే ఎంచుకొన్నా. ఇలాంటి పాత్రలే చేయాలి అనేం లేదు. కమర్షియల్ సినిమాలంటే గౌరవమే. కథానాయిక పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటే ఏ జోనర్ కథలో అయినా నటిస్తా’’ అన్నారు.