Siddharth: సినిమా పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ABN , First Publish Date - 2021-12-03T19:32:42+05:30 IST
సినిమా పరిశ్రమపై ఆధారపడి వేలమంది జీవనం సాగిస్తున్నారు. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు హీరో సిద్ధార్థ్. సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వాల జోక్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సిద్ధార్థ్ ప్రభుత్వాలను ప్రశ్నించారు.
పన్నులు.. సెన్సార్ విషయంలో చెప్పండి వింటాం...
సినిమా వ్యాపారం గురించి మీరు మాట్లాడవద్దు...
ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు
పరిశ్రమపై ఎందుకు ఇంత కక్ష?
దయచేసి ఈ పద్దతి మార్చుకోండి
రాజకీయ నాయకులను ప్రశ్నించగలరా?
సినిమా పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
– హీరో సిద్దార్థ్
సినిమా పరిశ్రమపై ఆధారపడి వేలమంది జీవనం సాగిస్తున్నారు. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు హీరో సిద్ధార్థ్. సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వాల జోక్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సిద్ధార్థ్ ప్రభుత్వాలను ప్రశ్నించారు.
‘‘పాతిక సంవత్సరాల క్రితం తొలిసారి విదేశాల్లో సినిమా చూశా. నా స్టూడెంట్ ఐడీకార్డు ఉపయోగించి అప్పట్లోనే ఎనిమిది డాలర్లు(200) చెల్లించి ఆ సినిమా చూశా. ఇప్పుడు మనం నిర్మిస్తున్న సినిమాలు టెక్నాలజీ, టాలెంట్లో మిగతా దేశాల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. సినిమా టికెట్లు, పార్కింగ్ రేట్లపై ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు. పదిమందికి వినోదం పంచే సినిమా కన్నా మద్యం, పొగాకుకు ప్రభుత్వాలు ఎక్కువ విలువిస్తున్నారు. దయచేసి ఈ పద్దతి మార్చుకోండి. ఎన్నో వేలమంది ప్రజలు పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. మా వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో మీరు మాకు చెప్పకండి! పన్నులు, సెన్సార్ విషయంలో మీరు ఏం చెప్పినా వింటాం. కానీ, నిర్మాతలు, వాళ్ల ఉద్యోగుల జీవనోపాది లేకుండా చేయకండి. ప్రభుత్వాలకు ఆదాయం కావాలనుకుంటే ప్రతి పరిశ్రమలోనూ ఎంతో మంది సంపన్నులున్నారు. వాళ్ల నుంచి కూడా తీసుకోండి. చలన చిత్ర పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సినిమా బడ్జెట్ అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడి ఉండదు. ఆ సినిమా దర్శకనిర్మాతలపై ఉంటుంది. సినిమా వ్యాపారంలో ఎవరు ఎంత సంపాదిస్తారో నిర్ణయించే హక్కు ఏ ఒక్కరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి సంపన్నులుగా రాణిస్తున్న రాజకీయనాయకులను ప్రశ్నించగలరా? దయచేసి పరిశ్రమను వేధించడం ఇకనైనా ఆపండి. దేశానికి తిండి పెడుతున్న రైతులు ఎంత గొప్పవారో మనందరికీ తెలుసు. ఇప్పటికే వాళ్ల కోసం మేము పోరాటం చేశాం. సినిమావాళ్లు రైతులంతా గొప్పవాళ్లం కాకపోవచ్చు. కానీ మేము కూడా మనుషులమే! ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నాం’’ అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.