Shreya Dhanwanthary: మొదటి సినిమా చేయడానికి 10 ఏళ్లు పట్టింది.. తినడానికి తిండి లేక..

ABN , First Publish Date - 2022-09-26T15:57:25+05:30 IST

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా హిందీ చిత్రం ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’(Chup: Revenge of The Artis)..

Shreya Dhanwanthary: మొదటి సినిమా చేయడానికి 10 ఏళ్లు పట్టింది.. తినడానికి తిండి లేక..

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా హిందీ చిత్రం ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’(Chup: Revenge of The Artis). ఇటీవలే విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీలో ఓ కీలకపాత్రలో నటించిన మెప్పించిన నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary). ఈ మూవీ విడుదలైన ఈ తరుణంలో ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన గత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వినోద పరిశ్రమలో అడుగు పెట్టడానికి ముందు తాను చాలా కాలం పాటు కష్టపడ్డానని చెప్పింది. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈ భామ తెలిపింది.


శ్రేయ కొన్ని నెలల వయస్సులో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లిపోయారు. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అనంతరం ఇంజినీరింగ్ కోసం భారతదేశానికి తిరిగి వచ్చింది. అప్పుడే ఈ భామకి నటి అవ్వాలనే లక్ష్యం ఏర్పడింది. దాంతో అప్పటి నుంచే పలు ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


శ్రేయ మాట్లాడుతూ.. ‘నా సినీ ప్రయాణం చాలా కష్టంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే నాకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. కానీ.. ఆ విషయాన్ని ఇతరులకి తెలియకుండా రహస్యంగా ఉంచాను. ఎందుకంటే నాలాంటి వారికి ఇది చాలా హాస్యాస్పదంగా, సాధించలేని విధంగా ఉంటుందని భావించాను. కానీ.. ఇప్పుడు ఇక్కడ ఉండడం నమ్మలేకపోతున్నాను.


మొదటి సినిమాలో అవకాశం రావడానికి నాకు దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టింది. ఆ సమయంలో డబ్బులేదు. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. చాలాకాలం తినడానికి సరైన తిండి కూడా లేదు. అయితే.. సినిమా అవకాశం ఎలా సాధించానో అడక్కండి. ఎందుకంటే నాకే తెలియదు. ఆ 10 సంవత్సరాలపాటు ఇబ్బందులు పడుతూ ఇక్కడే ఉన్నానంటే.. నాకు నిజంగా సినిమా అంటే ఉన్న పిచ్చే కారణం కావొచ్చు’ అని చెప్పుకొచ్చింది.


అయితే.. శ్రేయ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008, మిస్ ఇండియా 2008లో పాల్గొంది. వాటిలో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనంతరం ఆమె 2009లో నాగచైతన్య ‘జోష్’ టాలీవుడ్‌లో అడుగుపెట్టి, 2010లో ‘స్నేహ గీతం’ చిత్రం ఓ ప్రధానపాత్రలో నటించింది. అనంతరం దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆమె ఇమ్రాన్ హష్మీ నటించిన ‘వై చీట్ ఇండియా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సోనీ లీవ్ సిరీస్ ‘స్కామ్‌ 1992’తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది.

Updated Date - 2022-09-26T15:57:25+05:30 IST