‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-02-02T00:14:53+05:30 IST
`శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహర్షి` చిత్రాలతో మెసేజ్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేసిన సూపర్స్టార్ మహేష్ పక్కా ఔట్ అండ్ ఔట్
సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్రాజు
బ్యానర్స్: జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్
నటీనటులు: మహేశ్, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాశ్రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, సత్యదేవ్, పోసాని, సంగీత, హరితేజ, సుబ్బరాజు, అజయ్, వెన్నెలకిషోర్, రఘుబాబు, బండ్లగణేశ్, పవిత్ర లోకేశ్, రోహిణి, తమన్నా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: రత్నవేలు
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సెన్సార్: యు/ఎ
వ్యవథి: 169 నిమిషాలు
`శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహర్షి` చిత్రాలతో మెసేజ్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేసిన సూపర్స్టార్ మహేష్ పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలు చేసేడైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఒక పక్క 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.. అలాగే పటాస్తో డైరెక్టర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో సినిమాలు తెలుగులో సరిగ్గా ఆడవు అనే సెంమెంట్ ఉన్నప్పటికీ మహేశ్ ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. మరి మహేశ్ సెంటిమెంట్ను దాటి సక్సెస్ను సాధించాడా? సరిలేరు నీకెవ్వరుతో ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? కమర్షియల్ సినిమాల డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి సూపర్స్టార్ మహేశ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాసుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం.
కథ:
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్) సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్లోకి అదే పేరుతో మరో వ్యక్తి(సత్యదేవ్) జాయిన్ అవుతాడు. ఓ టెర్రరిస్ట్ ఎటాక్లో అజయ్(సత్యదేవ్) బాగా గాయపడతాడు. అతను త్వరలోనే చనిపోతాడు కాబట్టి ఆ విషయాన్ని అతని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణయించుకుంటుంది. అజయ్ తల్లి భారతి(విజయశాంతి) మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. చిన్న తప్పును కూడా భరించని వ్యక్తి తన పెద్దకొడుకు ఆర్మీలో చనిపోయినప్పటికీ చిన్నకొడుకు ఆర్మీకి పంపుతుంది. కొన్ని విలువల ప్రకారం భారతి చెల్లెలి పెళ్లి చేయడానికి అతని స్థానంలో మేజర్ అజయ్ కృష్ణ, ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి కర్నూలు బయలుదేరుతాడు. ట్రెయిన్లో సంస్కృతి(రష్మిక).. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న(రావు రమేశ్) ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో ఆమె మేజర్ అజయ్ని చూసి ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. వారి నుండి తప్పించుకుని అజయ్ కర్నూలు చేరుకుంటాడు. అక్కడ భారతి, వాళ్ల కుటుంబం కనపడదు. ఆమెను మంత్రి నాగేంద్ర(ప్రకాశ్ రాజ్) చంపడానికి ప్రయత్నిస్తుంటారు. వారి బారి నుంచి భారతిని ఆమె కుటుంబాన్ని కాపాడుతాడు మేజర్ అజయ్ కృష్ణ. అసలు నాగేంద్రతో భారతికి ఉన్న సమస్యేంటి? ఆమెను నాగేంద్ర ఎందుకు చంపాలనుకుంటాడు? మేజర్ అజయ్ కృష్ణ.. భారతి సమస్యను ఎలా తీర్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
కొన ఊపిరితో పోరాడుతున్న ఓ సైనికుడి పరిస్థితిని.. అతని కుటుంబసభ్యులకు సున్నితంగా చెప్పడానికి ఊరికి బయలు దేరిన హీరో, అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడనేది కథ. మహేష్ ఒన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు నడిపించాడు. 13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్పై విజయశాంతి కనిపించారు. యాక్టింగ్లోనూ, డైలాగు డెలివరీలోనూ ఆమె గ్రేస్ ఎక్కడా తగ్గలేదు. లొకేషన్లు, సెట్స్ అన్నీ బావున్నాయి. ‘నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్’ డైలాగు, కూజా చెంబుగా మారుతుందనే డైలాగ్, మరికొన్ని మేనరిజమ్స్ సందర్భోచితంగా నవ్వించాయి. రష్మిక ఫ్యామిలీ సీన్లు కాస్త డ్రమటిక్గా కనిపించాయి. బండ్ల గణేష్ సీన్ కనిపించనంత సేపు నవ్వించింది. సంగీత, రావు రమేష్ పాత్రలన్నీ బావున్నాయి. పాటలు కూడా స్క్రీన్ మీద కలర్ఫుల్గా ఉన్నాయి. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే, ఈ మూవీలో స్టెప్స్ని బాగా డిజైన్ చేశారు.
అమ్మాయి మీద కలిగిన ఇష్టాన్ని అబ్బాయి స్వేచ్ఛగా చెప్పే కథలతో ఎన్నో సినిమాలు చూశాం. ఇందులో అందుకు భిన్నంగా అబ్బాయి మీద కలిగిన ఇష్టాన్ని అమ్మాయి వ్యక్తం చేయడం కనిపిస్తుంది. మనసుకు నచ్చిన వ్యక్తి కాకపోయినా, సమాజంలో కాపురం సాగిస్తున్న మహిళల గురించి కూడా డైలాగుల్లో ప్రస్తావన ఉంది. మనం సమాజంలో అరుదుగా వినే మ్యారిటల్ రేప్ల గురించి కూడా హాస్యంగానైనా సంగీత పాత్ర ద్వారా ప్రస్తావించారు. సామాన్యుడి అకౌంట్లను ప్రభుత్వం పరిశీలించడం సంగతిని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అకౌంట్లను సామాన్యుడు పరిశీలించే అవకాశం ఉందా? అని ప్రశ్నించడం కూడా బావుంది. ఆర్మీలో శిక్షణ గురించి పలు సినిమాల్లో రకరకాలుగా చూపించారు. కానీ అదే శిక్షణకు మాట రూపమిచ్చి క్లైమాక్స్ లో చెప్పించడం బావుంది. దేశం గురించి, దేశాన్ని అమ్మతో పోల్చడం గురించి రాసుకున్న డైలాగులు కూడా మెప్పిస్తాయి. హీరోయిన్ అక్కలుగా నటించిన ఇద్దరి పాత్రలకూ పెద్ద ప్రాధాన్యం లేదు. పిల్లలపై సీరియళ్ల ప్రభావాన్ని ప్రస్తావించిన తీరు ప్రశంసనీయం. విలనిజాన్ని బిల్డప్ చేసిన తీరు బాగానే అనిపించినా, సస్టయిన్ చేయడంలో ఎక్కడో కాస్త తడబడినట్టు కనిపిస్తుంది.
యాక్షన్ సీక్వెన్స్ల విషయానికి వస్తే టెర్రరిస్ట్ ఎటాక్ నుండి పిల్లలను కాపాడే ఫైట్తో పాటు, నల్లమల అడవుల్లో ఫైట్ను చాలా చక్కగా డిజైన్ చేశారు. మిగిలిన ఫైట్స్ను కమర్షియల్ ఫార్మేట్లో బాగా డిజైన్ చేశారు. దేవిశ్రీ సంగీతంలో సరిలేరు టైటిల్ ట్రాక్, మైండ్ బ్లాక్ సాంగ్స్ బావున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బావుంది. పేట్రియాటిజమ్లో ఓ బాంబ్ పేలినప్పుడు మూడు రంగుల జెండా వచ్చేలా ఉండే సీన్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మీరు దేశం విలువ రూపాయల్లో చూస్తే.. నేను ఎగిరే జెండాలో చూస్తాను.. ఇలా పలు డైలాగ్స్ సందర్భానుసారం మెప్పిస్తాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాను అందంగా మలిచాడు. ఇక కొన్ని సన్నివేశాల్లో లాజిక్కులు కనపడవు. మినిస్టర్ను ఓ సైనికుడు భయపెట్టేయడం.. కొడుకు చనిపోయిన సంగతి ఎలా చెప్పాలా? అని అందరూ ఆలోచిస్తుంటే.. తనకు తెలిసిపోయినట్లు ఆమె మాట్లాడటం ఇవన్నీ లాజిక్కులకు అందవు. ఏదైనా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను నవ్వుకుంటూ .. అభిమానులు హీరో ఇమేజ్ను ఎంజాయ్ చేసేలా సినిమాను తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: సరిలేరు నీకెవ్వరు... సంక్రాంతి ఫీస్ట్
రేటింగ్: 3/5