‘శకుంతల’ తర్వాత.. ‘యశోద’గా సమంత
ABN , First Publish Date - 2021-12-06T20:59:40+05:30 IST
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో శకుంతలగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ మహిళా ప్రాధాన్యమున్న పాత్రతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో..
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో శకుంతలగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ మహిళా ప్రాధాన్యమున్న పాత్రతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్కు, పొటెన్షియల్కు తగ్గ కాన్సెప్ట్తో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్కు తగ్గ కథ కుదిరింది. సోమవారం పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలోనే ఇతర నటీనటులను తెలియజేస్తాం. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మణిశర్మ సంగీతం, ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, పులగం చిన్నారాయణ-డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందించనున్నారు’’ అని తెలిపారు.