Salman Khan: బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో రామ్‌చరణ్.. అలా వచ్చాడంటున్న సల్మాన్

ABN , First Publish Date - 2022-10-02T17:04:27+05:30 IST

బాలీవుడ్‌ ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ(Kisi Ka Bhai Kisi Ki Jaan)’ చిత్రం ఒకటి...

Salman Khan: బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో రామ్‌చరణ్.. అలా వచ్చాడంటున్న సల్మాన్

బాలీవుడ్‌ ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan)’ చిత్రం ఒకటి. ఇటీవల వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలవడంతో.. ఈ మూవీపైనే బీ టౌన్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ కూడా మంచి రెస్పాన్స్‌ని అందుకుని అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే.. గత నెలలోనే ఈ యాక్షన్ చిత్రం టైటిల్ లోగోని కూడా మూవీ టీం ఆవిష్కరించింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటు టాలీవుడ్ నటుడు వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే, జగపతి బాబు, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.


అంతేకాకుండా ఈ మూవీలో రామ్ చరణ్ (Ram Charan) అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్‌నే ధృవీకరించాడు. అదే సమయంలో రామ్ చరణ్ ఈ సినిమాలోకి ఎలా వచ్చాడో కూడా తాజాగా పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిత్రం ‘గాడ్ ఫాదర్‌’లో సల్మాన్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ హిందీ ట్రైలర్ తాజాగా ముంబైలో లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కి చిరంజీవితోపాటు సల్మాన్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’లో రామ్ చరణ్ క్యామియో గురించి మాట్లాడాడు.


సల్మాన్ మాట్లాడుతూ.. ‘మేము హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో వెంకీ నాతో ఉన్నాడు. అప్పుడే అక్కడికి నన్ను కలవడానికి రామ్ చరణ్ వచ్చాడు. నేను ఈ సినిమాలో నటించాలనుకుంటున్నాను అని అతను నాతో చెప్పాడు. నాతో, వెంకీతో కలిసి ఒకే ఫ్రేమ్‌ పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో అతను తమాషా చేస్తున్నాడని నేను అనుకున్నాను. దాని గురించి రేపు మాట్లాడుకుందాం అని చెప్పాను. మరుసటి రోజు తన కాస్ట్యూమ్‌తో సహా మా కంటే ముందే సెట్‌కి వచ్చేశాడు. అలా మేమిద్దరం కలిసి ఈ సినిమాలో పని చేయగలిగాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ మూవీని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సల్మాన్ ఖానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా.. ఈ చిత్రాన్ని 2022 చివరికి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Updated Date - 2022-10-02T17:04:27+05:30 IST