వివాదాస్పద అంశాలతో.. రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ ‘దహిణి’

ABN , First Publish Date - 2021-10-23T00:16:50+05:30 IST

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన చిత్రం ‘దహిణి’. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత

వివాదాస్పద అంశాలతో.. రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ ‘దహిణి’

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన చిత్రం ‘దహిణి’. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్‌, దత్తాత్రేయ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వాస్తవ ఘటనల ఆధారంగా రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ సినిమాలు తీస్తుంటారనే విషయం తెలిసిందే. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ‘విచ్ హంటింగ్’ పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో.. వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా ‘దహిణి’ చిత్రాన్ని రూపొందించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం... మన దేశంలో 2001 నుండి 2019 వరకు దాదాపు 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి వివిధ గ్రామాల ప్రజలు అత్యంత కిరాతంగా చంపారు. ఇటువంటి దురాగతాలపై ఎటువంటి కేసు లేదనే చెప్పాలి. ఒడిశా హైకోర్టు 2021లో చెప్పినదాని ప్రకారం... ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్యకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక 1987 నుంచి 2003 మధ్యన సుమారు పాతికవేల మందిని మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది. మన దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న ఈ ‘విచ్ హంటింగ్’ సమస్యను వెలుగులోకి తీసుకు రావాలని...  మానవ హక్కుల ఆందోళన, లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ రాజేష్ టచ్ రివర్ ఈ సినిమాను రూపొందించినట్లుగా నిర్మాతలు తెలియజేశారు.

Updated Date - 2021-10-23T00:16:50+05:30 IST