Oscars వేదికపై ఆ సింగర్స్కి థ్యాంక్స్ చెప్పడం మరిచానంటున్న AR Rahman.. దానికి కారణమిదేనంటూ..
ABN , First Publish Date - 2022-06-23T15:56:36+05:30 IST
ప్రపంచ సినీ చరిత్రలో ఆస్కార్స్ అవార్డులకు ఉన్న విలువ తెలిసిందే. తన కెరీర్లో ఒక్కసారైనా అంతటి ప్రతిష్టాత్మక అవార్డు..
ప్రపంచ సినీ చరిత్రలో ఆస్కార్స్ అవార్డులకు ఉన్న విలువ తెలిసిందే. తన కెరీర్లో ఒక్కసారైనా అంతటి ప్రతిష్టాత్మక అవార్డు సాధించాలని ప్రతి సినీ ఆర్టిస్టు కోరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు. అంతటి విలువైన అవార్డును సాధించి భారత సంగీతం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు ఏఆర్ రెహమాన్. 2009లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జై హో సాంగ్కి గానూ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ స్టేజ్పై ఆ అవార్డును అందుకుంటున్న తరుణంలో ఆ పాట పాడిన సింగర్స్కి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయానని అంటున్నాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా జూన్ 21న యూట్యూబ్లో ఓ వీడియోని రెహమాన్ విడుదల చేశాడు. అందులో ఆయన పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నాడు.
ఆ వీడియోని గాయకుడు సుఖ్విందర్ సింగ్కు రెహమాన్ అంకితం చేశాడు. దాదాపు 25 ఏళ్లుగా తమ మధ్య బంధం ఉన్నట్లు తెలిపాడు. తక్షక్ సినిమా కోసం మొదటిసారి సుఖ్వీందర్తో కలిసి పని చేసినట్లు రెహమాన్ గుర్తు చేసుకున్నాడు. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటైన స్లమ్డాగ్ మిలియనీర్ ‘జై హో’ కోసం సుఖ్వీందర్ ఎంతో సహకరించాడని, అయితే ఆయన ఆస్కార్ ట్రోఫీని అందుకునే సమయంలో ఆ పాట గాయకులైన సుఖ్విందర్ సింగ్, తన్వీ షా, మహాలక్ష్మి అయ్యర్, విజయ్ ప్రకాశ్ ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయానని తెలిపాడు.
ఆ వీడియోలో రెహమాన్ మాట్లాడుతూ.. ‘నేను ఆస్కార్ స్టేజ్పై అందరికీ కృతజ్ఞతలు తెలిపాను. అయితే.. ఆ సమయంలో నా మనస్సులో ఉన్న గందరగోళం కారణంగా నేను గాయకుల పేర్ల చెప్పడం మర్చిపోయాను. సాంగ్లో మెయిన్ పార్ట్ని పాడిన సుఖ్విందర్ సింగ్కి నేను నిజంగా కృతజ్ఞుడను. ఆయన ప్రత్యేక స్వరం పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. అది కాదనలేని సత్యం. ఆయన సహనం, ప్రేమకి, అలాగే ఆయన మ్యూజిక్కి ధన్యవాదాలు’ అని తెలిపాడు. కాగా.. ‘జై హో’ సాంగ్కి ఏఆర్ రెహమాన్ ఆస్కార్తోపాటు గ్రామీ అవార్డును సైతం గెలుచుకున్నాడు.