Akkineni Nageswararao : నలభై ఏళ్ళ తర్వాత విడుదల కానున్న చిత్రం

ABN , First Publish Date - 2022-08-17T17:21:13+05:30 IST

కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా.. ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోవు. ఒక వేళ కాలం కలిసి వచ్చి మళ్ళీ విడుదలకు సిద్దమైనా.. అలాంటి సినిమాలపై అంతగా అంచనాలుండవు. అలా లేటుగా విడుదలైన చాలా చిత్రాలు నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. కొన్ని చిత్రాలు మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచాయి.

Akkineni Nageswararao : నలభై ఏళ్ళ తర్వాత విడుదల కానున్న చిత్రం

కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా..  ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోవు. ఒక వేళ కాలం కలిసి వచ్చి మళ్ళీ విడుదలకు సిద్దమైనా.. అలాంటి సినిమాలపై అంతగా అంచనాలుండవు. అలా లేటుగా విడుదలైన చాలా చిత్రాలు నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. కొన్ని చిత్రాలు మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో  లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) నటించిన ఓ సినిమా 40 ఏళ్ళ తర్వాత విడుదల కానుండడం విశేషమని చెప్పాలి. సినిమా పేరు ‘ప్రతిబింబాలు’ (Prathibimbablu). అక్కినేని నాగేశ్వరరావు హీరోగానూ, జయసుధ (Jayasudha), తులసి (Tulasi) హీరోయిన్స్‌గానూ నటించగా.. సీనియర్ నటులు గుమ్మడి (Gummadi), కాంతారావు (Kantharao) ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆ సినిమాను 1982లో జాగర్లమూడి రాధాకృష్ణ (Jagarlamudi Radhakrishna) నిర్మించారు. ఏవో అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఈ సినిమా విడుదల ముంగిటే ఆగిపోయింది. అక్కినేని జయంతి సందర్భంగా చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నారు.


నిజానికి ఈ సినిమా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) తండ్రి కె.యస్. ప్రకాశరావు (KS Prakasharao) దర్శకత్వంలో షూటింగ్ మొదలైంది. చిత్రీకరణ మధ్యలో ఉండగా ప్రకాశరావు చనిపోయారు. దాంతో సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) దర్శకుడిగా రంగంలోకి దిగి మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. విష్ణుప్రియా కంబైన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా చక్రవర్తి (Chakravarthy) సంగీతం అందించారు. ఈ సినిమాకి సంబంధించిన వారిలో జయసుధ, తులసి, నిర్మాత రాధాకృష్ణ, మరికొందరు తప్ప మిగిలినవారెవరూ ప్రస్తుతం జీవించి లేరు. అప్పట్లో రీల్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రింట్‌ను డిజిటల్ పార్మేట్ లోకి కన్వర్ట్ చేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేయనుండడం గమనార్హం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. 


గతంలో విష్ణుప్రియ కంబైన్స్ బ్యానర్ పై ‘వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, కోరుకొన్న మొగుడు’ లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో కృష్ణ, శోభన్ బాబు, క‌ృష్ణంరాజు లాంటి హీరోలు నటించారు. అయితే ఎఎన్నార్‌తో కూడా ఓ సినిమా తీయాలని భావించిన జాగర్లమూడి రాధాకృష్ణ ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని నిర్మించారు కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో సినిమాను విడుదల చేయలేకపోయారు. ఎట్టేకేలకు ఇన్నాళ్ళకైనా సినిమాను విడుదల చేయనుండడం పట్ల తన సంతోషాన్ని వక్తం చేస్తున్నారు. మరి ఈ తరం ప్రేక్షకుల్ని ఎనభైలనాటి ప్రేమకథా చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-08-17T17:21:13+05:30 IST