పద్ధతైన పాత్రలే చేస్తా!

ABN , First Publish Date - 2022-09-20T05:54:30+05:30 IST

‘‘నటిగా నాకంటూ కొన్ని పరిమితులు, పరిధులు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ మీరను. ఇప్పటి వరకూ పద్ధతైన పాత్రలే చేశా...

పద్ధతైన పాత్రలే చేస్తా!

‘‘నటిగా నాకంటూ కొన్ని పరిమితులు, పరిధులు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ మీరను. ఇప్పటి వరకూ పద్ధతైన పాత్రలే చేశా. ఇక మీదటా అంతే’’ అంటోంది ప్రీతి అస్రాణి. ‘మళ్లీ రావా’తో ఆకట్టుకొన్న ప్రీతి... ‘ఫ్రెషర్‌ కుక్కర్‌’, ‘సిటీమార్‌’ చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’తో మరోసారి పలకరించబోతోంది. శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈనెల 23న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రీతి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ‘‘దొంగలున్నారు జాగ్రత్త.. కొత్త తరహా కథ. ఇలాంటి పాయింట్‌తో ఇంత వరకూ ఏ సినిమా రాలేదు. టైటిల్‌ చూసి ఇది దోపిడీకి సంబంధించిన కథ అనుకుంటున్నారు. కానీ.. అంతకు మించిన విషయాలు ఈ సినిమాలో ఉంటాయి. కథలో మలుపులు ఆకట్టుకొంటాయి. ఇందులో నీరజ అనే పాత్రలో నటించా. తనో మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి. మొండిది. ధైర్యవంతురాలు. నా నిజ జీవితానికీ నీరజకు కొన్ని పోలికలు ఉన్నాయి. అందుకే వెంటనే కనెక్ట్‌ అయిపోయా. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఒకే లొకేషన్‌లో తెరకెక్కించారు. అదో ఛాలెంజ్‌. సెట్‌కి వెళ్లగానే ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు అనిపించేది. శ్రీసింహా చాలా మంచి నటుడు. చాలా తక్కువ మాట్లాడతాడు. తనకు ఈ సినిమా మరింత మంచి పేరు తీసుకొస్తుంది. సమంత, సాయి పల్లవి లాంటి స్టార్‌ కథానాయికలు గొప్ప గొప్ప కథలు ఎంచుకొంటున్నారు. నేను కూడా వారి దారిలోనే పయనిస్తా. ‘యశోద’లో ఓ చిన్న పాత్ర చేశా. రెండు తమిళ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నా. ఓ వెబ్‌ సిరీస్‌ కూడా ఒప్పుకొన్నా’’ అని చెప్పుకొచ్చింది. 


Updated Date - 2022-09-20T05:54:30+05:30 IST