నటి జయలలిత ‘రుద్రం కోట’కు మోహన్ బాబు సపోర్ట్
ABN , First Publish Date - 2021-12-03T02:18:53+05:30 IST
జయలలిత చాలా మంచి అమ్మాయి. నాకు ‘రౌడీగారి పెళ్ళాం’ చిత్రం నుండి పరిచయం. అప్పటి నుండి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అలాంటి తను ఈ రోజు మొదటిసారిగా ఒక చిత్రాన్ని సమర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్ను అందించాలని
సీనియర్ నటి జయలలిత సమర్పిస్తున్న ‘రుద్రం కోట’ చిత్రానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సపోర్ట్ అందించారు. ఎఆర్కె విజువల్స్ బ్యానర్పై సీనియర్ నటి జయలలిత మొట్టమొదటిసారి సమర్పిస్తున్న చిత్రం ‘రుద్రం కోట’. అనిల్ కండవల్లి, విభీష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ని గురువారం మోహన్ బాబు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి వేడుకలకు హాజరై చాలా రోజులైంది. జయలలిత చాలా మంచి అమ్మాయి. నాకు ‘రౌడీగారి పెళ్ళాం’ చిత్రం నుండి పరిచయం. అప్పటి నుండి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అలాంటి తను ఈ రోజు మొదటిసారిగా ఒక చిత్రాన్ని సమర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్ను అందించాలని పిలవగానే వచ్చాను. ఎవరైనా చిన్న సినిమాతోనే మొదలుపెట్టి ఎంతో పెద్ద స్థాయి వరకు వెళతారు. నిర్మాతగా నేను కూడా చిన్న సినిమాతోనే మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ సాయిబాబా ఆశీస్సులతో మీ అందరి ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమాలో అందరూ కొత్త వారే అని తెలిసింది. ఏం పరవాలేదు ఇప్పుడు కొత్తే కానీ తరువాత పాత వారే అవుతారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ చాలా మంచి స్థాయికి వెళ్లాలని, అలానే దర్శకుడు కోన రాము పెద్ద డైరెక్టర్ అయ్యి నాకు కూడా తన సినిమాలో అవకాశం ఇవ్వాలని, అలానే ఆ సాయినాథుని ఆశీస్సులు ఈ చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర టీమ్కు నా అభినందనలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.
జయలలిత మాట్లాడుతూ.. ‘‘రుద్రం కోట చాలా మంచి కథ. అందుకే మొదటిసారి అటెంప్ట్ చేస్తున్నాను. హీరో అనిల్ రుద్రంగా, నేను కోటమ్మగా నటిస్తున్నాము. రుద్రం కోట అనే ఊరు ఖమ్మం జిల్లాలో పోలవరం చుట్టుపక్కల ఉండేది. ఇప్పుడది పోలవరం ప్రాజెక్ట్లో పోయింది. అక్కడే షూటింగ్ చేశాం. ఇందులో నటించిన ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది. ఇందులో 5 పాటలుంటాయి. అందరి ఆశీస్సులు కావాలి. మోహన్ బాబుగారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అనిల్ కండవల్లి, దర్శకుడు కోన రాము, హీరోయిన్ విభీష, రైటర్ వెంకట్ బాబు తదితరులు పాల్గొన్నారు.